ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్తాన్ బోర్డర్లో మరింత రెచ్చిపోతున్నది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ... ఇండియా పోస్టులపై కాల్పులు జరుపుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు పాక్ 2050 సార్లు ఉల్లంఘనకు పాల్పడి కాల్పులు జరిపినట్టు భారత ఆర్మీ ప్రకటించింది. పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించి.. కాల్పులు జరపడంతో.. 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ ఉల్లంఘనను పక్కన పెట్టి కాల్పులు జరపడం పెరిగినట్టు తెలుస్తోంది. కాగా, సైన్యం ఎదురు కాల్పుల్లో రెండు రోజుల క్రితం ఇద్దరు పాక్ సైనికులు మరణించారు. తెల్లజెండాలు తీసుకొని వచ్చి వారి సైనికులను తీసుకొని వెళ్లారు. పాక్ సైన్యం మరణిస్తున్నా, బుద్ధిరావడం లేదు.. కాల్పులు జరుపుతూనే ఉన్నది. భంగపడుతూనే ఉన్నది.
జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తరువాత పాక్ ఇండియాపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొచ్చి.. కాశ్మీర్ విషయంలో ఇండియాను ఇరుకున పెట్టాలని చూసింది. కానీ, అందుకు విరుద్ధంగా జరగడంతో పాక్ కు ఏం చేయాలో తెలియడం లేదు. ప్రపంచం ఆర్థికమాంద్యం దిశగా పయనిస్తుండటంతో.. పాక్ చెప్పే మాటలను పట్టించుకోవడం లేదని స్వయంగా ఇమ్రాన్ ఖాన్ చెప్పడం విశేషం.
అయితే, ఇమ్రాన్ ఖాన్ కేబినెట్ మంత్రులు అక్టోబర్ నుంచి ఇండియాతో యుద్ధం వస్తుందని పదేపదే చెప్తున్నారు. దీంతో బోర్డర్ లో ఉన్న ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నిత్యం తుపాకుల మోతతో క్షణక్షణం నరకంగా బతుకుతున్న అక్కడి ప్రజలకు యుద్ధం అనే మాట వింటే వణికిపోతున్నారు. ఒకవేళ యుద్ధం వస్తే.. పాక్ గెలుస్తుందనే నమ్మకం లేదని, ఇండియా బలమైన దేశం అని పాక్ ప్రధాని చెప్పడం విశేషం. అయితే, యుద్ధం వస్తే అణుయుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పాక్ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.