ఈ అసాధారణ విజయంన్ని క్రికెట్ అభిమానులతో పాటు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు భారత జట్టును కొనియాడుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా పంత్, గిల్, సిరాజ్, పుజారా, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, ఠాకూర్ల ప్రదర్శన అద్భుతమంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. అయితే పాకిస్తాన్ అభిమానులు కూడా భారత్ సాధించిన అద్భుత విజయం పై ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం. జట్టు సమిష్టిగా పోరాడి విజయం సాధించింది అంటూ ట్విట్టర్ వేదికగా భారత్ కు అభినందనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా రహానే కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్ల ప్రతిభను కొనియాడుతూ సానుకూల కామెంట్లు చేస్తున్నారు.
‘‘వాటే సిరీస్.. చారిత్రాత్మక విజయం. భారత్కు శుభాకాంక్షలు. టీమిండియా చూపిన పట్టుదల అమోఘం. భారత జట్టు నేడు వారి క్లాస్ ఆటను చూపించింది. మీరు ఇలాగే ఆడుతూ ఉండాలి. పాకిస్తాన్ నుంచి మీకు అభినందనలు’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘‘ఇంతటి ఘన విజయం. రిషభ్ పంత్ అత్యద్భుతం. ఇండియా వలె పాకిస్తాన్ జట్టు కూడా మమ్మల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నాం’’ అంటూ పాకిస్తాన్ అభిమాని ఆకాంక్షించారు. ఏ విధంగా ప్రత్యర్థి దేశం నుండి అభిమానులు టీమిండియాపై ప్రేమ చూపిస్తూ సానుకూలంగా స్పందించడం నిజంగా ఆనందం కలిగించే విషయమే చెప్పాలి.