శుక్రవారం ఐపీఎల్ 2021లో భాగంగా కోహ్లీ సేనతో జరిగిన టోర్నీ మొదటి పోరులో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసింది. అంటే ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ టోర్నీని ఓటమితోనే మొదలుపెట్టింది. అయితే గతంలో ఎనిమిది సార్లు ఓటమితో టోర్నీని మొదలు పెట్టిన ముంబై.. 5 సార్లు విజేతగా నిలిచింది. 2013 నుంచి ఇప్పటి వరకు ముంబై ఒక్కసారి కూడా తన తొలిపోరులో విజయ పతాకం ఎగరవేసింది లేదు. ఈ సీజన్లోనూ అదే సెంటిమెంట్ను కొనసాగించడంతో ఈ సారీ కూడా ట్రోఫీని రోహిత్ సేన కైవసం చేసుకుంటుందని అభిమానుల జోస్యం చెబుతున్నారు.
2013లోనూ ముంబై తన తొలి మ్యాచ్లో బెంగళూరుతో తలపడింది. అందులో ఆర్సీబీ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలయింది. ఆ మ్యాచ్లో దినేశ్ కార్తీక్ 37 బంతుల్లో 60 పరుగులు చేసి పోరాడినా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన ముంబై కేవలం 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే తొలి మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓటమి చవిచూసినా.. ఆ టోర్నీతోనే ముంబై తన తొలి ట్రోఫీని సొతం చేసుకుంది. అప్పటినుంచి వరుసగా ఇదే తరహాలో రాణిస్తోంది. మరి ముంబై అభిమానులు సెంటిమెంట్ ప్రకారం.. ఈ ఏడాది కూడా ముంబై ట్రోఫీ కొడితే.. హ్యాట్రిక్ కొట్టినట్లవుతుంది. మరి ముంబై ట్రోఫీ కొడుతుందా.. లేక మరే జట్టైనా ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.