ఉత్కంఠ భరితంగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు ఆటలో ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా 2-2 తో సిరీస్ సమం అయింది. 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించడం గమనార్హం. అయితే మొదటి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన ఇండియా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ లో కూడా తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పాలి. ముఖ్యంగా భారత బౌలర్లపై వీరవిహారం చేస్తున్న జానీ బెయిర్ స్టో వికెట్ తీసే అవకాశం రాగా స్లీప్ లో ఫీల్డింగ్ చేస్తున్న హనుమ విహారి క్యాచ్ జారవిడిచాడు.
ఇక ఈ తప్పిదానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరాజ్ బౌలింగ్లో బెయిర్ స్టో స్లిప్ లో క్యాచ్ ఇచ్చాడు. సింపుల్ క్యాచ్ హనుమ విహారి వదిలేయడంతో బెయిర్ స్టో కి లైఫ్ వచ్చింది. దీంతో ఆ తర్వాత సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలోనే విహారి ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ స్వరూపం మరోలా ఉండేది అని అతని పై మండిపడుతున్నారు నెటిజన్లు. ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు హనుమ విహారీ ఎంతో సింపుల్ క్యాచ్ జారవిడిచిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.