ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సరికొత్తగా వైద్యసేవలు ప్రాంభమయ్యాయి. ఈ మేరకు సోమవారం డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్ సేవలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిమెడిసిన్లో సంప్రదించాలని సూచించారు. టెలిమెడిసిన్ టోల్ ఫ్రీ నంబర్ 14410నుకేటాయించారు. అవసరం అయితే టెలిమెడిసిన్లో వైద్యుల సంఖ్యను పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఉదయం 8గంటల నుంచి సాయంత్ర 6గంటల వరకు టెలిమెడిసిన్లో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం మధ్యాహ్నం నుంచి మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నిరోధానికి డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్ సేవలను ఆయన ప్రారంభించారు. ఏపీలో వైరస్ కట్టడికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి.