తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అంతర్గత కలహాలు ఇప్పుడు ముదురుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన చెల్లి కవితపై తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి నిదర్శనం. ఇప్పటికే కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన కేటీఆర్, ఇప్పుడు ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను కూడా ఆమె చేతుల నుంచి లాగేయాలని యత్నాలు ప్రారంభించారు. ఈ చర్యలతో కవితను పూర్తిగా ఏకాకిని చేయాలనే కేటీఆర్ వ్యూహం స్పష్టమవుతోంది. జాగృతి స్థాపనలో కవితతో పాటు కీలకంగా వ్యవహరించిన నేతలు రాజీవ్ సాగర్, రాజారాం యాదవ్, మఠం బిక్షపతి తదితరులు ఇప్పుడు కేటీఆర్ వైపు మళ్లారు. హైదరాబాద్‌లో వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవితపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి తమను నడిరోడ్డుపై వదిలేసిందని రాజీవ్ సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు.


అంతేకాకుండా జాగృతి ఆవిర్భావంలో తమకూ సమాన హక్కు ఉందని, కాబట్టి ఆ సంస్థపై కవితకు మాత్రమే అధికారం లేదని స్పష్టంచేశారు. జాగృతి అనేది బీఆర్ఎస్‌కు అనుబంధంగానే ఏర్పడిందని, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలకే తాము లోబడి ఉంటామని వారు తెలిపారు. కవిత పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే జాగృతిలో చీలిక రావడం గమనార్హం. ఇది కవితకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఇటీవల హరీశ్ రావు, సంతోష్ రావులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత ఉద్రిక్తతలకు నాంది పలికాయి. ఆ వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో తండ్రి కేసీఆర్‌తో దీర్ఘ చర్చలు జరిపారు. ఆ మంతనాల ఫలితంగా కవితపై సస్పెన్షన్ వేటు పడింది.


ఇప్పటికీ కేటీఆర్ అదే ఫార్మ్ హౌస్‌లో ఉండి, భవిష్యత్ వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నారని సమాచారం. కవితను రాజకీయంగా ఒంటరి చేయడమే లక్ష్యంగా కేటీఆర్ మరింత కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాగృతిని కూడా ఆమె నుంచి లాగేయడం ఆ వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. మొత్తానికి, బీఆర్ఎస్‌లో కవిత పరిస్థితి రోజు రోజుకూ క్లిష్టతరం అవుతోంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన జాగృతి కూడా ఇప్పుడు ఆమె చేతిలోనుంచి జారిపోతున్నట్లుంది. కేటీఆర్ కఠిన వైఖరితో కవిత భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: