ఐసీఎంఆర్ ప్రతినిధులు రాష్ట్రంలో టెస్టులు చేస్తే, నామమాత్రంగానే పాజిటివ్స్ వచ్చాయని తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రజల్లో నమ్మకం కలిగించడానికే టెస్టుల సంఖ్య పెంచామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 650 మంది హోమ్ ట్రీట్మెంట్లో ఉన్నారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా చికిత్స అందజేస్తోందని తెలిపారు. మళ్లీ రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టే ఉద్దేశం లేదు అని సోమేశ్ కుమార్ చెప్పారు. ఇదిలా ఉండగా తెలంగాణలో కరోనా ప్రైవేట్ టెస్టులకు ఛార్జీలు ఖరారు చేశారు. ఇప్పటివరకూ కరోనా శాంపిల్ టెస్టులను ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబులూ నిర్వహించలేదు.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో... ప్రభుత్వం ప్రైవేట్ టెస్టులకు కూడా అనుమతించింది. ఐతే... ఆ టెస్టుల వివరాల్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబులూ... ప్రభుత్వానికి సమర్పించాలి. అలాగే... ప్రభుత్వం చెప్పిన రేట్లలకు మించకుండా టెస్టులు చేయాల్సి ఉంటుంది. అలాగే... ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసొలేషన్ ఇతరత్రా కరోనా సేవలపై చార్జీలు ఎంత ఉండాలో కూడా ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఇచ్చింది. ప్రైవేట్ లాబ్లో కరోనా పరీక్ష గరిష్ట ఛార్జీ రూ.2200. సాధారణ ఐసోలేషన్ ఛార్జి రోజుకు రూ.4000, వెంటిలేటర్ లేకుండా ఐసీయూ ఛార్జి రోజుకు రూ.7500, వెంటిలేటర్తో ఐసీయూలో ఛార్జి రోజుకు రూ.9000, యాంటీ బయోటిక్ మందులు వాడితే వాటి ఛార్జి అదనంగా ఉంటుంది.
ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కొన్ని కీలక విషయాలు చెప్పారు. కరోనా కట్టడికి పనిచేస్తున్న వారందరికీ పరీక్షలు చేస్తామన్న ఆయన... లాక్ డౌన్ విజయవంతంగా అమలు చేయడం వల్ల తెలంగాణలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని తెలిపారు. ఐసీఎంఆర్ స్వయంగా ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేసిన విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్ చుట్టూ కరోనా వ్యాప్తిని తెలుసుకోవడానికి 30 నియోజకవర్గాల్లో పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో ప్రతి ఇంటినీ సర్వే చేస్తామన్నారు. దీనికోసం అదనంగా సిబ్బందిని తాత్కాలికంగా నియమించి కోవడానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.