కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల నేడు మనల్ని అందరినీ వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఎంతో బాధాకరం అని, ఆ మహోన్నత వ్యక్తి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ పలువురు సినిమా ప్రముఖులు సాహిత్య అభిమానులు ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఇక కెరీర్ లో ఫస్ట్ టైం బాలకృష్ణ హీరోగా విశ్వనాధ్ తీసిన జనని జన్మభూమి సినిమాకి గేయరచయితగా వ్యవహరించిన సీతారామశాస్త్రి, ఆ తరువాత సిరివెన్నెల సినిమాతో గొప్ప గుర్తింపు సంపాదించారు. ఆ సినిమా సూపర్ గా సక్సెస్ కావడంతో పాటు అందులోని సాంగ్స్ అయితే మరింతగా ఆకట్టుకున్నాయి. ఇక అందులోని పాటలకు పలు అవార్డులు కూడా లభించడం విశేషంగా చెప్పుకోవాలి.
తన సినిమా జీవితంలో మొత్తంగా 3000 కి పైన సాంగ్స్ రాసిన సిరివెన్నెల ఇటీవల శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ సాంగ్ తో పాటు ప్రస్తుతం నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ తీస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ శ్యామ్ సింగారాయ్ సినిమాలో కూడా రెండు సాంగ్స్ రాసారు. కాగా అవే ఆయన కెరీర్ లో రాసిన చివరి పాటలని, అటువంటి మహోన్నత వ్యక్తిని కోల్పోవడం నిజంగా ఎంతో బాధాకరం అంటూ ఆ మూవీ హీరో నాని, శ్యామ్ సింగారాయ్ యూనిట్ ప్రత్యేకంగా సిరివెన్నెల మృతికి నివాళులు అర్పించినట్లు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ తో పాటు పలు ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం సిరివెన్నల మృతికి నివాళులు అర్పిస్తున్నారు.