బుల్లితెర మీద సత్తా చాటిన తరువాత వెండితెర తమ అధృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు టీవీ స్టార్స్. ఈ జనరేషన్ యాంకర్లు బుల్లితెర మీద యాంకరింగ్ చేస్తూనే హీరోలుగానూ తమ అధృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా టెలివిజన్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమా తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
ప్రదీప్ కన్నా ముందు మరో యాంకర్ రవి కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. బుల్లితెర మీద యాంకర్గా ఎన్నో షోస్ చేసిన రవి ఇది మా ప్రేమ కత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా ప్రజలకు తెలియకుండానే ఆ సినిమాను ప్రజలు మర్చిపోయారు. దీంతో ఇక సినిమాలకు దాదాపుగా గుడ్ బై చెప్పేశాడు రవి. అయితే అప్పటికే యాంకరింగ్ కు కూడా దూరం కావటంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయ్యారైంది రవి పరిస్థితి.
ఇక కేవలం హీరోలుగానే కాదు దర్శకులుగా కూడా సత్త చాటారు బుల్లితెర స్టార్లు. టీవీలో ఓ డాన్స్ రియాలిటీ షోతో యాంకర్ గా పరిచయం అయిన ఓంకార్ తరువత బుల్లితెర స్టార్ యాంకర్ గా ఎదిగాడు. తరువాత జీనియస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్ తొలి ప్రయత్నం లో ఫెయిల్ అయ్యాడు. అయిన మరోసారి ప్రయత్నించి రాజుగారి గది సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అదే సిరీస్లో రాజుగారి గది 2, రాజుగారి గది 3 సినిమాలో వరుస విజయాలు అందుకొని దర్శకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే వెండితెర మీద సక్సెస్ అయినా బుల్లితెరను మాత్రం వదిలిపెట్టలేదు ఓంకార్. ఈ టీవీలో స్టార్ యాంకర్ అనిపించుకున్న ప్రభాకర్ కూడా దర్శకుడిగా రెండు సినిమాలు రూపొందించాడు.