ఈ ఏడాది 2020 అస్సలు బాగాలేదని చాలా మంది అంటున్నారు.. నిజమే ఓ వైపు కరోనా.. తుఫాన్లు.. సినీ పరిశ్రమలో విషాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాట మరో విషాదం చోటు చేసుకుంది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు ఏఎల్ రాఘవన్ (80) నిన్న కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్తో కుప్పకూలిన ఆయనను భార్య ఎంఎన్ రాజం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన తన తుదిశ్వాస విడిచారు. 1947లో గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాఘవన్ వేలాది పాటలు పాడారు.
చివరిగా 2014లో విడుదలైన ఆడమా జైచోమాడ చిత్రంలో సీన్ రోల్డాన్ సంగీత సారథ్యంలో 'నల్లా కేతుక్కా పాదం' అనే పాట పాడారు. నెంజిల్ ఒరు ఆలయంలో రాఘవన్ పాడిన ‘ఎంకిరుంతాళం వాళ్గా’ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒకప్పుడు సీనియర్ గాయకులు గంటసాల, మహదేవన్, ఎస్ఎం సుబ్బానాయుడు, విశ్వనాథ్-రామ్మూర్తి, టీవీ రాజు, ఎస్పీ కోదండపాణి లాంటి దిగ్గజాలతో కలిసి ఆయన పని చేశారు. అప్పట్లో ఏఎల్ రాఘవ సాంగ్స్ అంటే తమిళనాట ఎంతో క్రేజ్ ఉండేది.
ఆయన గానం తెలుగు లో కూడా సుపరిచితమే. ఎన్టీఆర్ నటించిన ‘నిండు మనసులు’, ‘నేనే మొనగాణ్ణి’ చిత్రాల్లో పాటలు పాడారు. ‘కులగౌరవం’ సినిమాలో ‘హ్యాపీ లైఫ్’ అంటూ సాగే పాటను ఎల్.ఆర్.ఈశ్వరితో పాడారు. లెజండరీ సంగత దర్శకులైన కేవీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, జిక్కి, పి.లీల వంటి ప్రముఖ గాయకులతో కలిపి ఎన్నో పాటలు పాడారు. ఆయన భౌతిక కాయాన్ని చెన్నైలోని రాయపేటలోని నివాసానికి తరలించారు.