కరోనా దెబ్బకు సినీ ఇండస్ట్రీ దిగజారిపోయింది. షూటింగులు అరకొర జరుగుతుంటే.. థియేటర్లు ఇప్పటికీ తెరుచుకోలేదు. మరోవైపు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా అవి ఓటీటీలకే పరిమితమవుతున్నాయి. దీంతో ప్రముఖ హీరోల ఇమేజ్ తగ్గిపోతోంది. బాలీవుడ్‌ని దశాబ్ధాలుగా ఏలుతున్న కపూర్ కాందాన్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు అర్జున్ కపూర్. తండ్రి బోనీకపూర్, బాబాయి అనిల్‌ కపూర్‌ గైడెన్స్‌లో సినిమాల్లోకి వచ్చాడు. అయితే భారీ బ్యాక్‌ గ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా... ఆ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకోలేకపోతున్నాడు అర్జున్ కపూర్.  

అర్జున్‌ కపూర్‌కి గత ఏడు సంవత్సరాలుగా సరైన సక్సెస్ లేదు. 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' తర్వాత అర్జున్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడ్డాయి. భారీ బడ్జెట్‌తో హిస్టారికల్ డ్రామాగా వచ్చిన 'పానిపట్'కి  డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ ఫ్లాప్ తర్వాత అర్జున్‌ మళ్లీ ప్రేక్షకులని మెప్పించలేకపోయాడు. వస్తుందని ఎంత సర్ది చెప్పుకున్నా, అర్జున్‌ కపూర్‌ సమస్యలకి బ్రేకులు పడటం లేదు.  పైగా సినిమా సినిమాకి మార్కెట్‌ కూడా తగ్గిపోతోంది. దీంతో అర్జున్ కెరీర్‌ క్లైమాక్స్‌కి చేరుతుందనే కామెంట్స్ వస్తున్నాయి.

అర్జున్‌ కపూర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌తో బాగానే అవకాశాలు అందుకుంటున్నాడు. సినిమాలైతే వరుసపెట్టి చేస్తున్నాడు గానీ థియేటర్లలో ఆ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు లేక ఇబ్బందుల్లో పడుతున్నాడు. కరోనా లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడటంతో   రెండేళ్ల నుంచి అర్జున్‌ సినిమాలు ఓటీటీకే పరిమితమయ్యాయి. 'సందీప్ ఔర్ పింకీ ఫరార్, సర్దార్‌ కా గ్రాండ్‌సన్' సినిమాలు రెండూ ఓటీటీలోనే విడుదలయ్యాయి.

ఇక అర్జున్ కపూర్ తాజా  మూవీ 'భూత్ పోలీస్' కూడా ఓటీటీలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదు కాబట్టి, ఈ సినిమాని ఓటీటీలోనే రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారట నిర్మాతలు. ఇప్పటికే  సంప్రదింపులు పూర్తయ్యాయని, జులైలో 'భూత్‌ పోలీస్‌' విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: