ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి పరిపాలనా పరంగా తన చుట్టూ ఎంతో అనుభవం ఉన్న సీనియర్లనే నియమించుకుంటున్నాడు. ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ల నుంచి శాఖల కార్యదర్శులు, ఎస్పీలు, కలెక్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే అధికారుల విషయానికి వస్తే సినీయార్టీకే పెద్ద పీట వేస్తున్నాడు. ఇక తన సలహాదారుల విషయానికి వస్తే ఆయన చుట్టూ మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్నవాళ్లే ఉన్నారు. తాజాగా జగన్కు మరో సలహాదారుడిని నియమించుకున్నారు. అందులో భాగంగా.. సీనియర్ అధికారి, కేంద్ర స్థాయిలో పని చేసిన సుభాష్ చంద్ర గార్గ్ను తన సంక్షేమ పథకాల అమలుకు కీలకమైన నిధుల సమీకరణ బాధ్యతలను ఆయనకు అప్పగించారట.
సంక్షేమం అంటే వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉంటుంది. అసలు సుభాష్ చంద్ర గార్గ్కు ఉన్న అర్హతలు ఏంటి ? ఆయన్ను జగన్ ఎందుకు నమ్మారు ? ఆయన అనుభవం ఏంటన్నది పరిశీలిస్తే ఆసక్తికర విషయాలే బయటకు వస్తాయి. ఆయనకు జాతీయ స్థాయిలో సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అవగాహన, మేనేజ్మెంట్ నైపుణ్యం నేపథ్యంలోనే జగన్ ఆయనకు ఈ ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీ తీవ్రమైన లోటు బడ్జెట్లో ఉంది. సంక్షేమ పథకాలు అమలు, పోలవరం నిర్మాణం, కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధుల సేకరణ లాంటి విషయాలు ఇప్పుడు జగన్ ముందు పెద్ద సవాళ్లుగా ఉన్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాలకు రు. 50 వేల కోట్లు వెచ్చించడం అంటే మామూలు విషయం కాదు. ఈ టైంలో నిధుల సమీకరణ కోసం సీనియర్ సేవలు అవసరం ఉండడంతోనే జగన్ సుభాష్ చంద్రను తన సలహాదారుడిగా నియమించుకున్నారు. ఒక్క సుభాష్ మాత్రమే కాదు ఆర్థిక శాఖకు మరో కార్యదర్శిగా ఐఏఎస్ కార్తీకేయ మిశ్రాను నియమించుకున్నారు. ఏదేమైనా సీనియర్ల సలహాలతో జగన్ పాలనను పరుగులు పెట్టించేందుకు పక్కా ప్లానింగ్తో వెళుతున్నారు.