తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు ఈబిసి కాలనీకి చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఏలేరు వరద ముంపులో ఉన్న ఈబిసి కాలనీ వాసులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను ఎగతాళి చేస్తున్నారని... అధికారం లేదని అవహేళన చేస్తున్నారు.. నాకు మీ లాగా అహంకారం లేదని అన్నారు. రాష్ట్రంలో మూడు నెలలుగా వరద ఉంది.. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు అని మండిపడ్డారు. జిల్లాలో 1 లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని చెప్పారు.

రైతులను అపహాస్యం చేసి అవమానిస్తున్నారు.. వారు పండించేది తింటూ తిడుతున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన విమర్శించారు. వ్యవసాయశాఖ మంత్రి సొంత జిల్లాలో 64 మంది రైతులు  మృతి చెందారని అన్నారు. కౌలు రైతులందరికి రైతు భరోసా అన్నారు.. 15 లక్షల మంది ఉండగా కేవలం 54 వేల మందికి మాత్రమే ఇచ్చారన్నారు. రైతులకు కులాన్ని ఆపాదించారు.. అగ్ర వర్ణాల రైతులకు ఏ పధకం వర్తించడం లేదని  పేర్కొన్నారు.

జగన్ రెడ్డి గారు ఆకాశం లో   విహరించడం మానుకుని భూమి పైకి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోండన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తుంటే మమ్మల్ని తిడుతున్నారని విమర్శించారు. వరద వస్తుంది అని  తెలిసినా  స్పందించ లేదు.. ఫలితంగా ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి వరద పరిస్థితి పై ఆరా తీసే వరకు సిఎం స్పందించకపోవడం దారుణం అని మండిపడ్డారు. జనవరి నుంచి 25 లక్షల రూపాయిలు మాత్రమే ఇప్పటి వరకు రైతులకు నష్ట పరిహారం అందించారని అన్నారు. రైతుల శాపం మంచిది కాదు జగన్ రెడ్డి.. ఇప్పటికైనా మేలుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉండగా మమ్మల్ని ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇప్పడు 5 వందలు ఇస్తామంటున్నారని, మోటార్లకు మీటర్లు బిగిస్తే ఊరుకోం.. రైతుల పక్షాన టిడిపి పోరాటం చేస్తుందని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: