గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ భాగ్యనగర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. ఇకపై నగర ప్రజలు ఎవరూ నాలా (కుళాయి) బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ నెల వరకు మాత్రమే వాటర్ బిల్లు చెల్లించాలని అన్నారు. వచ్చే నెల డిసెంబర్ నుంచి ఎవరూ కూడా ఒక్క రూపాయి కూడా వాటర్ బిల్లు చెల్లించాల్సిన పనిలేదని అన్నారు. వంద శాతం పూర్తిగా నీటిని ఉచితంగా అందిస్తామని అన్నారు. దీని వల్ల 97 శాతం ప్రజలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. అయితే 20వేల లీటర్లకు పైబడి నీటిని వినియోగించిన వారికి మాత్రం కొంత మేరకు ఛార్జీలు విధిస్తామని అన్నారు.


అయితే నీటి వృధాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్నారు. చాలామంది నీటిని నిర్లక్ష్యంగా వృధా చేస్తుంటారన్నారు. అలాంటివి అరికట్టేందుకు 20వేల లీటర్లు పైబడి ఎవరైనా నీరు వాడితే వారికి ఛార్జీలు విధిస్తామని అన్నారు.
ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. దేశంలో హైదరాబాద్ గొప్ప నగరమని అన్నారు. ప్రస్తుతం జంట నగరాల్లో ఎక్కడా మంచి నీటి సమస్య లేదన్నారు. మిషన్ భగీరథతో నీటి సమస్యలు తొలగిపోయాయన్నారు గులాబీ బాస్ సీఎం కేసీఆర్. గతంలో నీటి కోసం వాటర్ ట్యాంకర్ల వద్ద యుద్ధాలు జరిగేవని గుర్తు చేశారు.


ప్రస్తుతం కొన్ని చోట్ల రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని అన్నారు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి కూడా ఉండదని అన్నారు. అలాగే వరద నీటి నివారణకు రూ.12 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని అన్నారు. జీరోకార్బన్ సిటీగా హైదరాబాద్‌ను మారుస్తామని అన్నారు. కాలుష్యం కూడా నియంత్రణ చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని అన్నారు. అలాగే నగరంలో లక్షలాదిగా ఎలక్ట్రిక్ వాహనాల్ని పెంచుతామని అన్నారు. ఇక శాంతి భద్రతల విషయంలో కూడా నగరం ఎంతో బాగుందన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: