టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ రెడ్డి మీ మూర్ఖపు నిర్ణయాలతో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తేవొద్దని సూచించారు. దేశంలోని మెజార్టీ రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే.. జగన్ రెడ్డి ప్రభుత్వం మొండిగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సరికాదు అని సూచించారు. రాష్ట్రంలో రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి, సరిపడా వ్యాక్సిన్ లేదు, హాస్పిటల్స్ లో రోగులకు ఆక్సిజన్, మందులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది అని ఆయన మండిపడ్డారు.

గత సంవత్సరం కరోనా వల్ల సిలబస్ కుదించారు,  ఆ కుదించిన సిలబస్ కూడా విద్యార్థులకుబోధించలేకపోయారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఓ వైపు కరోనా తీవ్రత, మరో వైపు పూర్తికాని సిలబస్ తో పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు  తీవ్ర ఆందోళన చెందుతున్నారు అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి  విద్యార్థుల ప్రాణాలతో  చెలగాటమాడుతారా? అని నిలదీశారు. కరోనా ఉధృతి వల్ల ఐ. సి.ఎ. స్సి, సి.బి.ఎ. స్సి,  జె.ఈ. ఈ మెయిన్స్ వంటి పరీక్షలు వాయిదా వేశారు అని అన్నారు.

తెలంగాణ లో తో పాటు పలు రాష్ట్రాల్లో 10 వతరగతి పరీక్షలు రద్దు చేశారు అని, జగన్ రెడ్డి కరోనా కి భయపడి తాడేపల్లి ప్యాలెస్ గేటు కూడా దాటడం లేదు అని మండిపడ్డారు. మరి  విద్యార్థులు స్కూల్,కాలేజీలకు వచ్చి పరీక్షలు ఎలా రాస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు, పలువురు చనిపోయారు అని, ఈ విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు పెడితే లక్షల మంది విద్యార్థులు కరోనా బారినపడే ప్రమాదం పొంచి ఉంది అని హెచ్చరించారు. మరి  విద్యార్థుల ప్రాణాలకు ముఖ్యమంత్రి భాద్యత వహిస్తారా ? లేక విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తారా? అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: