ఏం చేసినా చేయకున్నా అప్పు చేయాల్సిందే
అప్పు మన ఆస్తికి సమాన విలువ అయితే పర్లేదు
కానీ అంతకుమించి కూడా చేస్తే ఏమౌతుంది?
ఎలా చూసుకున్నా ఎంత మాట్లాడుకున్నా రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావాల్సినంత లేదు. పెట్టుబడులు రావాల్సినంత లేవు. ఆఖరికి ప్రభుత్వ రంగ సంస్థలు తమ మనుగడ కోసం దాచుకున్న డబ్బులన్నీ ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు చెల్లించాలని జీఓ ఇచ్చిన సీఎం వివాదాలకు నెలవుగా మారారు. ఈ క్రమంలో ఇదొక పెద్ద ఆర్థిక నేరమని, ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా నడుచుకోవడం తప్పని ఎందరు చెప్పినా ఎందరు అరచి గోల చేసినా వినిపించుకునే ఓపిక మరియు తీరిక లేవు గాక లేవు ఏపీ సర్కారుకు...
అప్పుల కుప్పగా ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం నడుస్తోంది. ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా కనీస స్థాయిలో నిధులు లేవు. వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. ఆదాయం పెంచుకునే దారులు వెతక లేక అప్పులపై ఆధారపడిపోతున్న జగన్ ప్రభుత్వం కొన్ని తప్పిదాలు అదే పనిగా చేస్తూనే ఉంది. చెప్పేందుకు ఇవన్నీ పైకి కఠినంగా ఉన్నా లోపలి వాస్తవాలు ఇంకాస్త తీవ్రంగానే ఉన్నాయి. అందుకే వాటి అమలు రేపు మనపై తప్పక పడనుంది. అప్పులకు సంబంధించి ఇప్పటికే కాగ్ ఏపీ సర్కారు తీరును తప్పుపట్టింది. కేంద్రం కూడా తప్పు పడుతూనే ఉంది. లెక్కకు మిక్కిలి అప్పులు చేసి ఏం చేస్తారన్న వాదన కూడా నెలకొని ఉంది. ఈ క్రమంలో మూడున్నర లక్షల కోట్ల అప్పులు ఎలా తీరుస్తారన్న సందేహం పైకి వినిపిస్తూనే ఉంది. అయినా కూడా సీఎం జగన్ తగ్గేదేలే అన్న విధంగానే ఉన్నారు. ప్రవర్తిస్తూ ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ నిధుల మళ్లింపుపై వివాదం నడుస్తూనే ఉంది. వీసీ శ్యాం ప్రసాద్..తన వేదనంతా ఉద్యోగ సంఘాలకు చెప్పారు. వర్శిటీ నిధులు ఫైనాన్స్ కార్పొరేషన్ కు బదిలీ చేయడంపై ఉన్న అభ్యంతరాలు అన్నీ తాను చెప్పినా ప్రభుత్వ పెద్దలు వినిపించుకోలేదని వీసీ అంటున్నారు. దీంతో తాను ఏంచేయాలో తోచక మౌనంగానే ఉండిపోయానని అంటున్నారు. ప్రభుత్వం అడిగినందున తమ ఇష్టానికి వ్యతిరేకంగా నిధుల మళ్లింపు అన్నది చేపట్టాల్సి వచ్చిందని కూడా ఆయన ఆవేదన చెందారు. కొన్ని నిధులు వెనక్కు ఇవ్వాలని, కొన్నింటికి వడ్డీ చెల్లించాలని తాను సూచించానని కూడా చెప్పారు. ఇవేవీ ఆయన అనగా సీఎం వినిపించుకున్న దాఖలాలే లేవని తేలిపోయింది.