భారత ఫుట్బాల్ దిగ్గజం, మాజీ సారథి ప్రదీప్ కుమార్ బెనర్జీ (83) కన్నుమూశారు. భారత్లో ఫుట్బాల్కు క్రేజ్ తెచ్చిన ఆటగాళ్లు చాలా తక్కువనే చెప్పాలి. వీరిలో ప్రదీప్ కుమార్ బెనర్జీ కూడా ఒకరు. ప్రదీప్ కుమార్ బెనర్జీ 1936లో జన్మించారు. ఇక కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న ఆయన శుక్రవారం కలకత్తాలో మృతి చెందారు. ఇక ఫుట్బాల్ ఆటగాడిగా ఆయన భారత్ ఫుట్బాల్ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన బెనర్జీ.. అనంతరం కోచ్గా కూడా జట్టుకు తన సేవలను అందించారు.
1936లో జన్మించిన బెనర్జీ భారత్ తరుపున 84 మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించి 65 గోల్స్ సాధించారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్లో భారత్ స్వర్ణం గెలవడంలో బెనర్జీ కీలక పాత్ర పోషించారు. అలాగే 1960లో జరిగిన రోమ్ ఒలంపిక్స్లో ఫ్రెంచ్తో జరిగిన మ్యాచ్లో ఆయన భారత జట్టు తరపున ఏకైక గోల్ సాధించి మ్యాచ్ డ్రా చేసేందుకు సహాయ పడ్డారు. ఆ తర్వాత జరిగిన రోమ్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత జట్టుకు పీకే బెనర్జీనే కెప్టెన్గా వ్యవహరించారు.
పీకే బెనర్జీ ఆ తర్వాత కోచ్గా కూడా భారత జట్టు ఫుట్బాల్ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. పీకే బెనర్జీ మరణం యావత్ క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ దిగ్గజ ప్లేయర్ మృతి పట్ల భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సంతాపం తెలిపారు. బెనర్జీ ఆత్మకు శాంతి కలగాలని కూడా ఆయన ప్రార్థించారు. ఈ సందర్భంగానే బెనర్జీతో తనకు ఉన్న జ్ఞాపకాలను సైతం సచిన్ నెమర వేసుకున్నారు. ఆయనతో దిగిన ఫోటోను సచిన్ తన సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. పీకే బెనర్జీకి ఇద్దరు కుమార్తెలు. ఆయన తమ్ముడు ప్రసూన్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు.