తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు బోయపాటి శ్రీనివాస్ - నందమూరి బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెంట్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. ఇక లెజెండ్ మూవీ అయితే రికార్డులు మోత మోగించింది. గత కొంత కాలంగా వీరిద్దరికీ సరైన హిట్స్ లేవు. రామ్ చరణ్ తో తీసిన వినయ విదేయ రామ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక క్రిష్ దర్శకత్వంలో వచ్చిన తన వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్యకు ఒక్క హిట్ కూడా పడలేదు. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా వర్క్ ఔట్ కాలేదు. ఆ మద్య కేఎస్ రవికుమార్ తో ‘రూలర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ... ఇది కూడా బొక్కబోర్లా పడింది.
ప్రస్తుతం తనకు అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటితోనే మరోసారి కమిట్ అయ్యారు బాలయ్య. అయితే బాలకృష్ణ చిత్రం ఒకరు కాదు.. కనీసం ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉండటం పరిపాటైంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే బోయపాటి ఎక్కడా కాంప్రమైజ్ కారు. ప్లాపుల్లో ఉన్న ఇద్దరికీ బడ్జెట్ సమస్యలు ఎదురైన విషయం తెల్సిందే. చిత్రాన్ని ప్రాఫిటబుల్ చేయాలంటే పరిమిత బడ్జెట్ లోనే చిత్రాన్ని పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం ఇద్దరూ తమ తమ పారితోషికాలను బాగా తగ్గించేసుకున్నట్టు సమాచారం. ఈ కారణాల వల్ల మొదట 70 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్తా ఇప్పుడు 50 కోట్లకు చేరుకుంది. దీంతో పాటు ఇప్పుడు బోయపాటి శ్రీను మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు బోయపాటి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా బాలయ్య మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు.. కానీ ఈసారి ఒక్క హీరోయిన్ తో కానిచ్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలయ్య సరసన అంజలి నటిస్తుండగా.. మరో హీరోయిన్ శ్రియ లేదా త్రిషను తీసుకోవాలనుకున్నారట. కానీ ఆ పాత్రే లేకుండా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఎంత వరకు నిజమో, అబద్దమో అన్న విషయం అఫిషియల్ గా ప్రకటన వచ్చే వరకు తెలియదు.