సినీ తారల రెమ్యూనరేషన్ లకు సంబంధించిన వార్తలు ఆడియన్స్ను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు సినిమా బడ్జెట్లో సగానికి పైగా తమ రెమ్యూనరేషన్లుగా తీసుకుంటున్నారు. అదే ఓ యాడ్ ఫిలిం చేయాలంటే మాత్రం ఆ లెక్క మరింత పెరుగుతోంది. ఇంటర్నేషనల్ లెవల్లో క్రేజ్ ఉన్న బాలీవుడ్ హీరోలు యాడ్స్కు కూడా సినిమా స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి షాకే ఇచ్చాడు.
బ్రాండ్ ప్రమోషన్ల విషయంలో సెలక్టివ్గా ఉండే సల్మాన్ ఖాన్ ఇటీవలో ఓ చైనీస్ మొబైల్ కంపెనీకి ప్రచార కర్తగా వ్యవహరించేందుకు ఒప్పందం చేసుకున్న సంగతి తెలసిందే. ఇప్పటికే ఈ బ్రాండ్కు సంబంధించిన సల్మాన్ బొమ్మతో కొన్ని పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. త్వరలో సల్మాన్తో ఓ భారీ యాడ్ చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం సల్మాన్ 7 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న సల్మాన్ ఈ యాడ్ లో నటించేందుకు భారీ పారితోషికం అందుకోబోతున్నాడట. గతంలో ఏ ఇండియన్ హీరో కూడా తీసుకోని విధంగా ఒక్క రోజు 7 కోట్ల చొప్పున సల్మాన్ చార్జ్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సల్మాన్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎంతైన ఇచ్చేందుకు కంపెనీలు రెడీ గా ఉన్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రభుదేవా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దిశా పటానీ కథానాయికగా నటిస్తున్నారు. రణ్దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రంజాన్కు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.