ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత డబ్బులు ఖర్చుపెట్టుకొని పార్టీకి పనిచేశారు.. ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తానని, పార్టీకి విధేయులంటే వీరేనని ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ పొగడ్తలతో ముంచెత్తారు. వారికి మంత్రి పదవులిస్తానని, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలు జరిగాయి. తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. వీరి సంగతి మాత్రం గాలికొదిలేశారా? లేదంటే కావాలనే పట్టించుకోవడం మానేశారా? అనేది ఆయనకే తెలియాలి. వారెవరంటే గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి విధేయులుగా ఉంటూ వస్తోన్న మర్రి రాజశేఖర్, రావి వెంకటరమణ,మక్కెన మల్లికార్జునరావు. చిత్రమేమిటంటే వీరంతా ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలవడం గమనార్హం.
పదవుల పంపకంలో అన్యాయం?
ముఖ్యమంత్రి జగన్ అమలుచేస్తోన్న పదవుల పంపకమనేది గుంటూరు జిల్లా నేతలను తీవ్ర అన్యాయానికి గురిచేస్తోంది. ఎమ్మెల్సీగా పంపిస్తానని, మంత్రి పదవిస్తానని చెప్పి ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసే రీతిలో వ్యవహరించారంటూ విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా, పారిశ్రామికంగా తనకు ఉపయోగపడతారనుకునేవారికే ఆయన పదవులు కేటాయిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయోధ్య రామిరెడ్డికి నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం కల్పించకపోయినప్పటికీ రాజ్యసభ సభ్యుణ్ని చేశారు. అలాగే లేళ్ల అప్పిరెడ్డికి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఇవ్వకపోయినప్పటికీ తాజాగా ఎమ్మెల్సీ పదవిని కేటాయించారనే విషయాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
మర్రి రాజశేఖర్కు తీవ్ర అన్యాయం?
చిలకలూరిపేట నుంచి విడుదల రజనికి అవకాశం ఇస్తున్నాను.. అధికారంలోకి రాగానే రాజశేఖర్కు మంత్రి పదవి ఇస్తానని జగన్ బహిరంగంగానే ప్రకటించారు. రెండు సంవత్సరాలు దాటినప్పటికీ ఇంతవరకు ఆ హామీ ఊసే లేదు. ఈ విషయంలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం తీవ్ర అసంతృప్తితో ఉండటం గమనార్హం. మర్రి రాజశేఖర్కు అన్యాయం జరిగిందనే భావన వారందరిలో ఉంది. అలాగే వినుకొండ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న మక్కెన మల్లికార్జునరావుకు అవకాశం కల్పిస్తానన్నారు. ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులను ఓడించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అలాగే పొన్నూరు నుంచి కిలారి రోశయ్యకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తూ రావి వెంకటరమణకు పదవి ఇస్తానన్నారు. ఇంతవరకు ఆయన గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా వీరేకాకుండా చివరి నిముషంలో పార్టీచేరి గెలుపునకు సహకరించిన నేతలు మరికొందరు కూడా ఉన్నప్పటికీ వారంతా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు.