- ఓటుకు ఆరు వేలు
- రెండు లక్షల మంది ఓటర్లు
ఇప్పుడంతా రాజకీయం హుజురాబాద్ చుట్టూ తిరుగుతోంది. ఫలితాలు ఎలా ఉన్నా కూడా హుజురాబాద్ చుట్టూనే తిరుగుతు న్నాయి. ఓ వైపు హాయిగా నోట్ల పంపిణీ సాగుతోంది. ఇందుకు సంబంధించి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా కూడా 100కు పైగా బైండోవర్ కేసులు నమోదు అయినా కూడా ఎక్కడా ఎవ్వరూ తగ్గేదేలా అన్న విధంగా రాజకీయం చేస్తున్నారు. నగదు పంపిణీ పథకాన్ని అమలు చేస్తూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇదే సందర్భంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు కానుకల పంపిణీకి సైతం ఇదివరకే ఓ సారి ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎన్నికల వేళ దళిత బంధు పథకానికి వెచ్చించిన 1200 కోట్ల రూపాయలు, బెట్టింగుల కోసం అక్కడి ఔత్సాహికులు వెచ్చిస్తున్న వెయ్యి కోట్ల రూపాయలు ఇంకా మిగతా మొత్తాలు కలుపు కుంటే ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీ గురూ అనే అనిపిస్తున్నాయి. గెలుపు ఎవరిది అయినా ఓటరుకు దక్కే ఫలితం ఏమీ ఉండదు. రేపటి వేళ బీజేపీ తరఫున ఈటెల గెలిచినా, గులాబీ దండు తరఫున గెల్లు గెలిచినా హుజురాబాద్ మారిపోతుంది అని చెప్పడమే పెద్ద జోక్. అదేవిధంగా హుజురాబాద్ పరిధిలో ఉన్న నాలుగు మండలాలకూ ఒక్కో కేంద్ర ప్రభుత్వ సంస్థ మంజూరు చేయిస్తాం అని ఎవ్వరు చెప్పినా, మాటల్లో మాటగా చొప్పించినా అదంతా పెద్ద జోక్.
గెల్లును గెలిపిస్తే..
జమ్మికుంటకు ఒక మెడికల్ కాలేజీ
హుజురాబాద్ కు ఒక ఎయిమ్స్ కాలేజీ
కమలాపూర్ కు ఒక మెడికల్ యూనివర్సిటీ
వీణవంక కు ఒక వేయి పడకల నిమ్స్ ఆస్పత్రి
ఇస్తామని తన్నీరు హరీశ్ రావు ఊదరగొట్టారని సమాచారం. అదే నిజం అయితే అంతకుమించిన కామెడీ మరొకటి ఉండదు గాక ఉండదు.