వాస్తవానికి ఈ ఆలోచన ఆయనిది కాదని ఎవరో చెబితేనే ఈ విధంగా మూడు రాజధానుల ప్రకటన చేసి ఉంటారని ఇప్పటికీ అంటుంటారు కొందరు వైసీపీ నేతలు. మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యమే కాదని అదంతా చాలా అవాస్తవిక దృక్పథంలో భాగమేనని నిపుణులు కూడా తేల్చారు. ముఖ్యంగా హై కోర్టు తరలింపు సాధ్యం కాని పని అని వీలుంటే డివిజన్ బెంచ్ లు ఏర్పాటు మాత్రం సాధ్యం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువని న్యాయ నిపుణులు మరియు కోవిదులు తేల్చారు. మరోవైపు అడ్మిన్ ను పూర్తిగా విశాఖకు తరలించాలని జగన్ భావించినా అది కూడా సాధ్యం కాలేదు. మధ్య మధ్యలో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లు మాత్రం అడ్మిన్ వింగ్ (సెక్రటేరియట్ తో సహా ఇతర విభాగాలను సీఎంఓ మినహాయించి) ను త్వరలోనే తరలిస్తామని కొత్త ఏడాదిలో అన్నింటిపైనా ఓ స్పష్టత వచ్చేస్తుందని అన్నారు. ఇలాంటి గందరగోళ వాతావరణంలోనే సీఎస్ ఓ చోట సీఎంఓ ఓ చోట ఇలా ఎలా సాధ్యం అన్న వార్తలూ వచ్చాయి.అయితే వీటిని పెద్దగా పట్టించుకోలేదు యువ ముఖ్యమంత్రి జగన్. వైజాగే రాజధాని ( ఓ విధంగా పేరేమయినప్పటికీ) అని చెబుతూ.. వీలున్నంత వరకూ సంబంధిత పరిసర ప్రాంతాల అభివృద్ధికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. ఓ వార్త అనుసారం భీమిలి పరిసరాల్లో వైఎస్ జగన్ కోసం ఓ ఇల్లు సిద్ధం చేశారని కూడా తెలిసింది. అవన్నీ కాదని ఇప్పుడు రాజధాని విషయమై సీఎం తరఫున ఓ స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది.
ఇక రాజధాని రైతులను ముంచిందెవరు తేల్చిందెవరు? అన్నది చూద్దాం. భూమికి భూమి దాంతో పాటు రైతుల నుంచి తీసుకున్న భూమిని అభివృద్ధి చేసేంత వరకూ కొంత పరిహారం ప్రభుత్వమే చెల్లించాలి అన్నది బాబు ప్రభుత్వం చెప్పిన మాట. వైసీపీ వచ్చాక రాజధాని భవంతులు నిలిచాయి. అంతేకాకుండా ఇక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆగిపోయింది. ల్యాండ్ పూలింగ్ మాట పోయి ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ పెద్దలు పెద్ద ఎత్తున్న మాటలతో దండయాత్ర చేశారు. వీటిపై టీడీపీతో పాటు ఆఖరికి కోర్టు కూడా వైసీపీ ఆరోపణలు తప్పే అని తేల్చేసింది. అందుకు తగ్గ ఆధారాలేవీ ప్రభుత్వం తరఫు వాదనల అనంతరం కోర్టుకు సబ్మిట్ చేయకపోవడంతో ఈ గొడవ కాస్త సద్దుమణిగింది.
తాజాగా న్యాయ స్థానం నుంచి దేవస్థానం వరకూ పేరిట రైతులు పాదయాత్ర చేపట్టడం, అందుకు బీజేపీ అనూహ్య రీతిలో మద్దతు ఇవ్వడంతో రాజధాని గొడవ మరో మలుపు తిరిగింది.దీంతో జగన్ దిగివచ్చి మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును వెనక్కు తీసుకోనున్నామని కాసేపట్లో చెప్పనున్నారు. బాగుంది మరి రాజధాని రైతు ఇంతకాలం కోల్పోయినవన్నీ ఎవరు తిరిగి తెచ్చి ఇస్తారు అన్నదే సిసలు ప్రశ్న. భూములు వదిలి ధర్నాల పేరిట ప్రాణ త్యాగాలకు సైతం వెరవక కృషి చేసిన రైతులకు మోడీ తరహాలో జగన్ క్షమాపణలు చెబితే ఇప్పటి నష్టం ఎలా తీరిపోతుంది అన్నది టీడీపీ తరఫు ప్రశ్న.