ప్రస్తుతం ప్రపంచాన్నికోవిడ్, కరోనా ఈ రెండు పేర్లు హడలెత్తిస్తున్న నాయి. నిన్న మొన్నటి వరకు చైనా దేశాన్ని గడగడలాడించిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రమక్రమంగా ఒక్కో దేశానికి విస్తరిస్తోంది. ప్రస్తుతం కరోనా అన్న పేరు వింటేనే ప్రపంచం హడలి పోతోంది. చైనా దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన ఈ వైరస్ మనదేశంలో తొలి రోజుల్లో కేరళకు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇక ఇప్పుడు కేరళ నుంచి క్రమక్రమంగా ఒక్కో రాష్ట్రానికి విస్తరిస్తూ వస్తోంది. తెలంగాణలో ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో తొలి కరోనా కేసును వైద్యులు గుర్తించారు. ఇక ఇప్పుడు హైదరాబాద్లోనూ కరోనా బాధితులు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 65 మందికి కరోనా లక్షణాలు సోకినట్టు అనుమానిస్తున్నారు. వీరిలో 29 మందికి ఇంటిలోనే ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి వైద్యలు పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఇక మిగిలిన 36 మందికి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వ్యాధి సోకిన వారికి ప్రాణాపాయం లేకుండా వైద్యలు వైద్యం అందిస్తున్నారు.
ఇక కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికక్కడ అలెర్ట్ అవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఏం చేయాలి ? అనే దానిపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అత్యవసర సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక కరోనా లక్షణాలు సోకినట్టు అనుమానాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం పొడి దగ్గు, జలుబుతో కూడిన జ్వరం ఉంటే మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.