గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉభయ గోదావరిజిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా కాపులు ఏకమయ్యారు. అయితే .. ఆయన ఎక్కువ కాలం నిలబడలేక పోయారు. దీంతో కాపులు ఒంటరయ్యారు. ఫలితంగా ఇతర పార్టీల్లోకి సర్దుకున్నారు. అయినప్పటికీ.. వారికి సరైన వేదిక మాత్రం లభించకపోవడం గమనార్హం. మరోవైపు.. రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. జనసేన అధినేత పవన్పై నా కాపులకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయన తమకు అండగా నిలబడతాడనే నమ్మకం వారిలో కలగకపోవడం గమనార్హం.
ఈ పరిణామాలతో అటు చిరు, ఇటు పవన్లపై కాపులకు రాజకీయ అభిమానం కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో ఎవరైనా తమకు లీడ్ చేసే నాయకుడు దొరుకుతాడేమో.. అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కాపుల తరఫున తూర్పుగోదావరికి చెందిన సోము వీర్రాజు బీజేపీలో చక్రం తిప్పుతున్నారు. అయితే.. ఈయనను సైతం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. పార్టీ ఎటు స్టాండ్ తీసుకుంటే అటు ఆయన మారిపోతారు. పైగా జాతీయ పార్టీ రాజకీయం కావడంతో కాపులకు న్యాయం చేస్తారనే విశ్వాసం కూడా లేదు.
వెరసి.. కాంగ్రెస్లో ఉన్నప్పుడు తమకు సమస్యలు చెప్పుకొనే అవకాశం ఉండేదని.. ఇప్పుడు ఏ పార్టీ కూడా తమను ఓటు బ్యాంకుగానే చూస్తోందని.. అంటున్నారు. ఈ పరిణామాలతోనే కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు కూడా మౌనంగా ఉండిపోతున్నారనేది వీరి ఆవేదన. ఈ నేపథ్యంలో ఎవరు తమను లీడ్ చేసేందుకు ముందుకు వచ్చిన సహకరిస్తామని చెబుతున్నారు. అయితే, కాపులకు మాత్రమే అంకితం అయ్యే రాజకీయాలు చేయాలని కోరుతుండడం గమనార్హం.