భారత్లో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. గత 24గంటల్లోనే దేశ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1409 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21700కు చేరుకుంది. 16689 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 686మంది మృతి చెందారు. 4325 మంది కోలుకున్నారు. అలాగే.. 14 రోజుల నుంచి దేశవ్యాప్తంగా 78 జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉండడం గమనార్హం. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేట్ 19.89శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే.. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో సుమారు 48శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇందులో ప్రతీ రాష్ట్రంలో 2వేల మార్క్ను దాటిపోయింది. మహారాష్ట్రలో 5,652 కేసులు ఉన్నాయి. 4594 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 789మంది కోలుకున్నారు. 269మంది మరణించారు. గుజరాత్లో 2,407 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 2125 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 179మంది కోలుకున్నారు. 103మంది మరణించారు. ఇక ఢిల్లీలో 2,248 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1476 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 724మంది కోలుకున్నారు. 48మంది మరణించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు మరియు ఉత్తర ప్రదేశ్ సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో మొత్తం కేసులలో 78 శాతం ఉన్నాయి, ఒక్కొక్కటి 1,000 కి పైగా కేసులు నమోదయ్యాయి.