పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అంటే ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన హీరోలను తెరపై చూపించే విధానం.. చెప్పించే డైలాగులు మరే దర్శకుడికి రైటర్ కి సాధ్యపడని రీతిలో ఉంటాయని చెప్పవచ్చు. సినిమాలో హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసి చూపించే డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ముందు వరుసలో ఉంటాడు. హీరోలకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి దానికి స్పెషల్ ఇమేజ్ ని తీసుకొస్తాడు. ఆయనకంటూ ఓ ఇగో.. ఆయనకంటూ ఓ వ్యక్తిత్వం.. ప్రత్యేకత ఉంటాయి. అవే సిల్వర్ స్క్రీన్ పై హీరోలలో కనిపిస్తూ ఉంటాయి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనిపించుకున్న పూరి.. మనసులో ఒకటి బయటకు ఇంకోటి మాట్లాడలేడు. పూరీ సినిమాల్లో హీరో కూడా అంతే. 

 

హీరో కారక్టరైజేషన్ లో కొంచెం నెగిటివిటీ ఉంటుంది. ఈ సమాజం యాక్సెప్ట్ చేయలేని విధంగా హీరో మాట్లాడుతూ ఉంటాడు. బూతులు మాట్లాడుతుంటాడు.. జనాలు హేట్ చేసేలా బిహేవ్ చేస్తుంటాడు. అదే పూరి నుండి ప్రేక్షకులు కోరుకుంటుంటారు. ఆయన ఫస్ట్ సినిమా నుండి ఈ మధ్య వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా వరకూ ఇదే పద్ధతి ఫాలో అవుతూ వస్తున్నాడు. అందుకే పూరీతో యాక్ట్ చేసిన హీరోలకు ఆ సినిమాలు ప్లాప్ అయినా ప్రత్యేకంగా మిగిలిపోతాయి. ఇప్పటి యూత్ కి బూతులు మాట్లాడే బ్యాడ్ బాయ్స్ నచ్చుతున్నారని పసిగట్టి పూరి రెగ్యులర్ హీరోనే ఇంకాస్త పచ్చిగా మాట్లాడిస్తాడు. ఆయన గత చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' అందుకే పెద్ద హిట్టయి కూర్చుంది. అంతవరకు చాక్లెట్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ సినిమాలో కంప్లీట్ మేక్ ఓవర్ తో మాస్ పాత్రలో అదరగొట్టాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండని కూడా అదే రూట్ లో తీసుకెళ్తున్నాడు పూరీ. 

 

పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే ఈ మూవీ ఫైటింగ్ నేపథ్యంలో 'ఫైటర్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఐతే ఈ విషయం పై తాజా ఇంటర్వ్యూలో నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లారిటీ ఇచ్చారు. ఆమె విజయ్ దేవరకొండ మూవీ గూర్చిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఫైటర్ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే… ఓ ఆసక్తికర టైటిల్ ఈ మూవీ కోసం రిజిస్టర్ చేసి ఉంచడం జరిగింది. త్వరలోనే టైటిల్ పై ప్రకటన ఉంటుంది అని ఆమె చెప్పుకొచ్చారు. పూరి సినిమాలకు టైటిల్స్ చాలా భిన్నంగా ఉంటాయి. సినిమా టైటిల్ తోనే జనాల్లోకి సినిమాని తీసుకెళ్ళిపోతాడు పూరి. మరి విజయ్ దేవరకొండ కోసం ఆయన ఎలాంటి క్రేజీ టైటిల్ మైండ్ లో ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారో చూడాలి. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ 'ఇస్మార్ట్ శంకర్' టైపులో ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తి అయినది. పూరి కనెక్ట్స్ బ్యానర్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: