టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 36వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్, కొద్దిరోజులుగా కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలను తన కుటుంబసభ్యుల మధ్య సాదాసీదాగా జరుపుకున్నారు. కొన్నాళ్ల నుండి వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ తో కూడా మరొక విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నారు. 

 

ఇక నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రేక్షకులతో పాటు ఎందరో అభిమానులు, అలానే సినిమా ప్రముఖులు సైతం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విషెస్ ని తెలియచేస్తున్నారు. కాగా కెజిఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు. కొన్నాళ్ల క్రితం మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నెని ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, తాము అతి త్వరలో ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. అవకాశం ఉన్న మేరకు ఆ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ నటించే ఛాన్స్ ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఇక నేడు ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతూ ప్రశాంత్ నీల్ పెట్టిన పోస్ట్ పరిశీలిస్తే, తన తదుపరి సినిమాని ఎన్టీఆర్ తో చేయడం ఖాయం గానే కనిపిస్తోంది. 

 

ఇప్పటికే కెజిఎఫ్ చాప్టర్ 1 తో అతిపెద్ద విజయాన్ని అందుకున్న ప్రశాంత్, ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా కెజిఎఫ్ చాఫ్టర్ 2 రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. కాగా దాని అనంతరం ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా వస్తుంది అనగానే అప్పట్లోనే ఈ వార్త ఎంతో ప్రచారం అవ్వగా, నేడు ప్రశాంత్ ట్వీట్ తరువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో ఒక పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్, దాని అనంతరం త్రివిక్రమ్ తో, అలానే ఆపై ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనుండడంతో అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: