అంటే అవునంటోంది సాక్షి పత్రిక.
సీఐడీ దర్యాప్తుతో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కుట్ర బట్టబయలైందంటూ సాక్షి పత్రిక ఇవాళ తన దిన పత్రిక మొదటి పేజీలో ఓ సంచలన కథనం ప్రచురించింది. మే నెలలో రఘురామకృష్ణంరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేసినప్పుడు ఆయన సెల్ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా ఆ సెల్ఫోన్ కాల్డేటాను సీఐడీ పోలీసులు విశ్లేషించారట. ఆ సమయంలోనే ఈ కుట్ర బహిర్గతమైందంటోంది సాక్షి పత్రిక. ఈ అంశాలను సీఐడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టుకు ఇటీవల సమర్పించిన అఫిడవిట్లో వివరంగా నివేదించారట.
సీఐడీ మొత్తం 230 పేజీల అఫిడవిట్ను సుప్రీంకోర్టుకు సమర్పించారట. ఈ నివేదిక సారం ఏంటంటే.. చంద్రబాబు డైరెక్షన్లోనే, ఆయన అనుమతి పొందాకే రఘురామ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్తో సహా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వివిధ అంశాలను తన అజెండాగా చేసుకున్నారట. రఘురామ కృష్ణంరాజు, చంద్రబాబు.. ఇద్దరి మధ్య జరిగిన పలు వాట్సాప్ సంభాషణలు, చాటింగ్లు ఈ విషయాన్ని పక్కాగా రుజువు చేస్తున్నాయట. కులాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కూడా ఇందులో భాగమేనట. ఇలాంటి అంశాలతో పాటు రఘురామ మీడియా ద్వారా మాట్లాడే అన్ని విషయాలూ చంద్రబాబుకు ముందే తెలుసట.
వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు డైరెక్షన్లోనే రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారని సీఐడి దర్యాప్తులో తేలిందట. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ అనుకూల మీడియా చానళ్లు ఏబీఎన్ –ఆంధ్రజ్యోతి, టీవీ 5 యాజమాన్యాలు, ప్రతినిధులతో రఘు రామకృష్ణరాజు జరిపిన వాట్సాప్ సంభాషణలన్నీ పరిశీలిస్తే... వీరి మధ్య ఉన్న బంధం వెల్లడైందట. మొత్తానికి సంచలన విషయాలే బయటికొచ్చాయి. మరి వీటిపై చంద్రబాబు అండ్ కో ఏమంటారో చూడాలి.