ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్ చొరవ కారణంగా కొన్ని విషయాల్లో ముందు వరుసలో ఉంటోంది. జగన్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరేమనుకుంటున్నా ముందుకే అంటూ దూసుకెళ్తున్నారు. అలాంటి వాటిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన పాఠశాలల్లో తప్పనిసరి చేయడం ఒకటి. ఈ విషయంపై జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ బడిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అన్నారు.
ఐదు సంవత్సరాలు పరిపాలన చేసే అవకాశం ప్రజలు కల్పిస్తే.. చంద్రబాబు ఇంగ్లిష్ మీడియం తీసుకురాలేకపోయాడని జగన్ అన్నారు. 66% గవర్నమెంట్ స్కూళ్లలో ఇప్పటికీ తెలుగు మీడియం కొనసాగుతోంది. అదే ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు చూసుకుంటే కేవలం 28% స్కూళ్లలోనే ఇంగ్లిష్ మీడియం బోధన సాగుతోంది. కానీ ప్రైవేటు స్కూళ్లు చూస్తే 94 శాతం ఇంగ్లిష్ బోధన చేస్తున్నాయి. ఆనాడు ఎలాగైతే ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్లు తీసుకున్నారో ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం విషయంలోనూ చంద్రబాబు అదే చేస్తున్నారు అన్నారు జగన్.
చంద్రబాబునాయుడు కొడుకు లోకేష్, అచ్చెన్నాయుడు కొడుకు ఇంగ్లిష్ మీడియంలో చదవలేదా.. పత్రికలు నడిపే యాజమాన్యాలు కూడా వాళ్ల పిల్లల్ని ఇంగ్లిష్ లోనే చదివిస్తున్నారు. ఈనాడు నడిపే రమాదేవి పబ్లిక్ స్కూల్ కూడా ఇంగ్లిష్ మీడియంలోనే నడుస్తోందంటూ సీఎం వైఎస్ జగన్ అనేక ఉదాహరణలు చూపారు . ఈ విషయం గురించి దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులతో చర్చించామన్నారు. ప్రోగ్రామ్ రూపొందించుకున్నామన్నారు.
ఒకటి నుంచి ఆరో తరగతి దాకా వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నాం. ఫస్ట్ సెకండ్ క్లాస్లకు 10 వారాల పాటు జూన్ 2020 నుంచి ఆగస్టు వరకు బ్రిడ్జ్ కోర్సులను రూపొందించామన్నారు. థర్డ్, ఫోర్త్ క్లాసులకు 8 వారాలపాటు జూన్, జూలై నెలల్లో, ఐదు, ఆరు క్లాసులకు ఏప్రిల్, మే నెలల్లో ఇంటెన్సివ్ బ్రిడ్జ్ కోర్సులు ప్రవేశ పెడుతున్నామన్నారు జగన్.