ఏపీలో అధికార వైసీపీ గత యేడాది జరిగిన ఎన్నికల్లో ఏకంగా 22 ఎంపీ సీట్లలో సంచలన విజయం సాధించింది. రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లలో కేవలం మూడు చోట్ల మాత్రమే టీడీపీ ఎంపీలు విజయం సాధించారు. ఈ ముగ్గురు కూడా అత్తెసరు మెజార్టీలతో గట్టెక్కిన వారే. జగన్మోహన్ రెడ్డిని నమ్మిన ఏపీ ఓటర్లు ఆ పార్టీకి పట్టిన బ్రహ్మరథంలో టీడీపీ ఎంపీ క్యాండెట్లు చిత్తు చిత్తుగా ఓడారు. ఈ క్రమంలోనే వైసీపీ ఏకంగా 22 ఎంపీ సీట్లలో విజయం సాధించింది. అలా వైసీపీ తరఫున 22 మంది నెగ్గినా ఇప్పుడు ఒక ఎంపీ మాత్రం ఆల్మోస్ట్ తను వైసీపీ కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం.
అదేంటి వైసీపీ ఫుల్ స్వింగ్లో ఉంది... 22 మంది ఎంపీలు... అటు రాజ్యసభ సభ్యులతో పార్లమెంటులో చాలా ప్రతిపక్ష పార్టీల కంటే బలంగా ఉంది.. మరి ఈ టైంలో ఆ పార్టీ నుంచి తప్పుకున్నట్టు బిహేవ్ చేస్తోన్న ఆ ఎంపీ ఎవరనుకుంటున్నారా ? ఈ పాటికే చాలా మందికి క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆయనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. గతంలోనే జగన్తో స్నేహం చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్ను నానా మాటలు అన్న ఆయన వైసీపీ వయా బీజేపీ, టీడీపీ తిరిగి వైసీపీ గూటికి చేరారు.
ఏదో అని చెప్పి జగన్ టిక్కెట్ ఇచ్చినందుకు ఇప్పుడు వైసీపీకే కంట్లో నలుసు మాదిరిగా మారారు. గత కొన్నాళ్లుగా ఆయన తీరు వైసీపీకి దూరదూరంగా ఉందని స్పష్టం అవుతోంది. ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టేందుకు వైసీపీని వాడుకున్న ఆయన అప్పటి నుంచి ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో టచ్లో ఉంటూ జగన్ను ఏదో ఇబ్బంది పెట్టేలా చేయాలన్ననట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే రెండు మూడు సార్లు జగన్ ఆయనకు క్లాస్ పీకినా మార్పపు రాకపోవడంతో ఆయన్ను పక్కన పెట్టేయాలని కూడా పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా వైసీపీ ఎంపీలతో కన్నా... బీజేపీ వాళ్లతోనే ఆయన ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఇతర పార్టీల నేతలకు పార్టీలు ఇవ్వడంతో పాటు సొంత పార్టీ నేతల కంటే ఇతర పార్టీల నేతలతోనే ఆయన ఎక్కువ సత్సంబంధాలు నెరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయన్ను వైసీపీ వాళ్లు కూడా తమ పార్టీ ఎంపీల లెక్కలోనుంచి తీసేశారన్న గుసగుసలు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.