కరోనా వైరస్ ప్రపంచదేశాలను కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 62వేల మందికిపైగా కరోనాతో మృతి చెందారు. ఇక లక్షలాదిమంది కరోనాతో బాధపడుతున్నాయి. అయితే.. కరోనా వైరస్ కట్టడికి దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. భారత్లో కూడా కరోనా ప్రభావం తీవ్రస్థాయిలోనే ఉంది. వైరస్ కట్టడికి పార్టీలకతీతంగా ప్రజలందరూ ఒక్కతాటికిపైకి వస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఇక ప్రభుత్వాల అన్నిశాఖలూ కరోనా విధుల్లో ఉంటున్నారు. అయితే.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నిత్యం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగే ఎన్కౌంటర్లతో దద్దరిల్లే దండకారణ్యం కూడా ప్రస్తుతం ప్రశాంతంగా ఉండనుంది. కరోనా వైరస్ కట్టడికి మావోయిస్టులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత సమయంలో ఎలాంటి దాడులకు పాల్పడకూడదని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మల్కన్గిరి కోరాపుట్-విశాఖ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో ఆడియో టేపు విడుదల అయింది. ఈ ఆడియో టేపులో వచ్చిన సందేశం ప్రకారం.. వైరస్ను నిరోధించడానికి పాలకవర్గాల ప్రయత్నాలకు ఆటంకం కలిగించొద్దని మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు కైలాసం అనే వ్యక్తి సందేశం ఇచ్చారు. అయితే.. ఇదే సమయంలో తమపై పోలీసులు దాడులకు దిగితే మాత్రం ప్రతిదాడులు తప్పవని మావోయిస్టులు హెచ్చరించారు. ఏదిఏమైనా.. కరోనా వైరస్ చివరికి మావోయిస్టులను కూడా ప్రభావితం చేసిందని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో ముందుముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి. అయితే.. మావోయిస్టుల నిర్ణయంపై పోలీసు బలగాలు ఎలాస్పందిస్తాయన్నది అందరిలో ఆసక్తినిరేపుతోంది. అంటే.. కరోనా ప్రభావం ఉన్నంతకాలం దండకారణ్యంలో తుపాకుల మోత ఉండదని పలువురు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!