ప్రపంచ మహమ్మారి కరోనాను ప్రపంచానికి అంటించిన డ్రాగన్ కంట్రీ చైనా ఎప్పటికప్పుడు కరోనా లెక్కల విషయంలో తొండాట ఆడుతూ తన వక్ర బుద్ధిని చూపించుకుంటూ వస్తోంది. కరోనా చైనా దేశంలోనే ఈ వైరస్ పుట్టిన వుహాన్ నగర సమీపంలోనే లేదు. అయితే అదే కరోనా కొన్ని లక్షల మైళ్ల దూరంలో ఉన్న అమెరికా, యూరప్.. బ్రిటన్.. ఫ్రాన్స్, జర్మనీ.. బెల్జియం తో పాటు ఇటు ఆసియా దేశాలను అతలా కుతలం చేసేస్తోంది. దీనిపైనే ప్రపంచ మేథావులు అనేక లక్షల సందేహాలు వ్యక్తం చేస్తున్నా డ్రాగన్ కంట్రీ మాత్రం అసలు ఇది తమ వైరస్సే కాదు అని బుకాయించే ప్రయత్నం కూడా చేసింది. చివరకు అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తూ వేలాది మందిని పొట్టన పెట్టేసుకుంది.
అయితే ముందు నుంచి కరోనా లెక్కల విషయంలో చైనా దాగుడు మూతలు ఆడుతోందన్న అనుమానాలు ఉన్నాయి. ఇవే ఇప్పుడు నిజం అయ్యాయి. అవి బట్ట బయలు అయ్యాయి. చైనా ప్రస్తుతం చెబుతున్న గణాంకాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ కేసులు నమోదు అయ్యి ఉంటాయని ఓ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం చైనాలో ఇప్పటికే 6.40 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక అక్కడ చాలా మంది చనిపోయినా చైనా ఈ లెక్కలన్నింటిని ప్రపంచానికి తెలియకుండా దాచేస్తోందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ వివరాలు చైనా రక్షణ సాంకేతిక జాతీయ విశ్వవిద్యాలయం నుంచి ఓ నివేదిక లీక్ అయినట్లు వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న ఫారిన్ పాలసీ మ్యాగజైన్ అండ్ 100 రిపోర్టర్స్ వెల్లడించింది.
ఈ సంస్థ నివేదికలో మొత్తం 230 నగరాల్లో నమోదు అయిన కేసుల వివరాలు పొందు పరచడం జరిగింది. ఇక చైనా చెబుతున్న గణాంకాల ప్రకారం ఆ దేశంలో ఇప్పటి వరకు 82 వేల కరోనా పాజిటివ్ నమోదు అయ్యాయి. ఇక మన దేశంలో కూడా కరోనా కేసులు ఇప్పటికే చైనాను క్రాస్ చేసి 90 వేలు దాటేసి లక్షకు అతి చేరువలో ఉన్నాయి. అలాంటిది అసలు కరోనా వైరస్ పుట్టిన చైనాలో కేవలం 82 వేల కేసులు మాత్రమే ఉన్నాయని చైనా చేసిన ప్రకటన ప్రపంచానికే అనేక సందేహాలు రేకెత్తించింది.