ఎర‌క్క‌పోయి.. ఇరుక్కుపోయిన‌ట్టుగా ఉంద‌ట‌.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. మాజీ పాత్రికేయుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప‌రిస్థితి! ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇచ్చే ప‌నిలో ఉన్న ఆయ‌న కొన్నాళ్లుగా ఆప‌నితో పాటు.. మ‌రోప‌నినీ చేస్తున్నారు. ఫ‌క్తు.. రాజ‌కీయ నాయ‌కుడి అవ‌తారంతోపాటు.. ప్ర‌జాప్ర‌తినిధి పాత్ర‌నూ పోషించేస్తున్నారు. దీంతో ఎక్క‌డ ప్ర‌భుత్వానికి ఎలాంటి దెబ్బ‌త‌గిలినా... వెంట‌నే ఆయ‌న త‌న త‌ల‌కు గుడ్డ చుట్టుకుని రంగంలోకి దిగిపోతున్నారు.  ఇటీవ‌ల ప్ర‌భుత్వానికి, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి మ‌ధ్య వివాదం త‌లెత్తిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో గ‌త ఏడాది నుంచి కూడా స‌జ్జ‌ల చ‌క్రం తిప్పుతున్నారు.

త‌న శ‌క్తి మేర‌కు ప్ర‌బుత్వాన్ని ఒడ్డున ప‌డేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వైసీపీలోనే చ‌ర్చ సాగుతోంది. కోర్టు తీర్పుల‌పై వైసీపీ నేత‌లు.. కొంద‌రు ప‌రుషంగా మాట్లాడిన స‌మ‌యంలో కూడా స‌జ్జ‌ల వారు రంగంలోకి దిగి.. స‌ర్దుబాటు చేశారు. ఇక‌, హైకోర్టు న్యాయ‌మూర్తి ఒక‌రు జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు కూడా వెనువెంట‌నే రంగంలోకి దిగి.. ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఇలా.. ఎప్పుడు ఎక్క‌డ ఎలాంటి అవ‌స‌రం ఉన్నా.. స‌జ్జ‌ల ప్ర‌త్యక్ష‌మ‌వుతున్నారు. తాజాగా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌డం.. దీనిని రాష్ట్ర స‌ర్కారు తీవ్రంగా ప్ర‌తిఘ‌టించే ప్ర‌య‌త్నంలో హైకోర్టుకు వెళ్లిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఈ ప‌రంప‌ర‌లో మ‌రొక‌టి జ‌రిగింది. అనూహ్యంగా ఉద్యోగులు, వారి సంఘాల నాయ‌కులు కూడా ప్ర‌భుత్వానికి అనుకూలంగా వాయిస్ వినిపించాయి. ఎన్నిక‌ల‌కు స‌హ‌క‌రించేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టాయి. ఇక‌, ఉద్యోగ సంఘాలు ఇంత ధైర్యంగా.. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ‌పై తిరుగుబాటు బావుటా ఎగుర‌వేయ‌డం ఎవ‌రున్నార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. దీనిపై వైసీపీ నేత‌ల గుస‌గుస‌ల‌ను బ‌ట్టి.. స‌జ్జ‌ల సూచ‌న‌ల‌తోనే .. ఉద్యోగ సంఘాలు రంగంలోకి దిగాయ‌ని తెలుస్తోంది. ఇంత వ‌ర‌కుబాగానే ఉంది.

వారు మీడియా ముందుకు వ‌చ్చారు. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు లేఖ‌లు రాశారు. ప్రాసెస్ ఆపాల‌న్నారు.. ఓకే! ఇప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు స‌జ్జ‌ల‌కు అదే ఉద్యోగ సంఘాల నుంచి సెగ మొద‌లైంది. ``మీ సూచ‌న‌ల‌ను మేం పాటించాం.. కాబ‌ట్టి.. మాకు 5.5 శాతం ఫిట్‌మెంట్ స‌హా డిమాండ్లు పూర్త‌య్యేలా చూడండి`` అని ఒత్తిడి పెంచుతున్నారు. నిజానికి ఇలాంటివాటిలో సజ్జ‌ల వేలు పెట్టేసాహ‌సం చేయ‌రు. కానీ.. ఇప్పుడు సెగ పెరుగుతున్న నేప‌థ్యంలో ఏం చేస్తారో.. అనే ఆస‌క్తిగా ఉంది. ఇప్పుడు ఈ విష‌యం వైసీపీలో ఆస‌క్తిగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: