హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంత్రుల‌కు జిల్లాల ఇన్‌చార్జి బాధ్య‌త‌లను అప్ప‌గించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఎలాగైనా ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల టీఆర్ ఎస్ పార్టీని గెలిపించుకోవాల‌ని అధినేత ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అంతే వేగంగా జిల్లాల్లో పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై ఆయ‌న దృష్టి సారించారు. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో తాను నేరుగా ప‌ర్య‌టించ‌డం సాధ్యం కాద‌ని భావించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను మంత్రుల‌కు అప్ప‌గించారు.  శుక్రవారం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఖమ్మం- నల్లగొండ- వరంగల్ జిల్లాల పట్టభద్రుల స్థానాల్లో ప్రచారంపై సమీక్షించారు.


ఈ సందర్భంగా ఆయా జిల్లాల వారిపై మంత్రులకు గెలుపు బాధ్యతలను అప్పగించారు. జిల్లాల వారిగా ఇన్ చార్జీలను నియమించారు. రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్‌గా మంత్రి హరీశ్ రావు, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్‌గా మంత్రి గంగుల కమలాకర్, మహబూబ్ నగర్ జిల్లా ఇన్‌చార్జ్‌గా మంత్రి ప్రశాంత్ రెడ్డిని నియమించారు.  ఖమ్మం- నల్లగొండ- వరంగల్ జిల్లాలకు కేటాయించాల్సి ఉంది. ప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డ‌మంటే గెలవ‌కుంటే ఆ బాధ్య‌త‌ల‌ను కూడా మోయ‌డ‌మ‌న్న‌ట్లే అంటూ మంత్రులు భ‌య‌పడుతున్న‌ట్లుగా ఆ పార్టీ శ్రేణుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఆరేళ్ల క్రితం జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఉద్యోగ సంఘ నేత జీ దేవీప్ర‌సాద‌రావు బీజేపీ అభ్య‌ర్థి, న్యాయ‌వాది రామ‌చందర్ రావు చేతిలో ఓట‌మి చ‌విచూశారు.  


దీంతో ఈ ప‌ర్యాయం టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల‌లోనూ బీజేపీకి మ‌రోమారు అవ‌కాశం ఇవ్వ‌రాద‌నే ఉద్ధేశంతో వ్యూహాత్మ‌కంగా మాజీ ప్ర‌ధాని పీవీ కుమార్తె సుర‌భి వాణిదేవీని బ‌రిలోకి దించింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఓట్ల‌ను చీల్చ‌డంతోపాటు పీవీ అభిమానుల ఓట్లు కూడా రాలుస్తుంద‌ని పార్టీ అంచ‌నా వేసిన‌ట్లుగా క‌న‌బ‌డుతోంది. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఇతర ప్రజాప్రతినిధులకు కేటీఆర్ టార్గెట్లు పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ సారి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాల‌ని పార్టీ అధిష్ఠానం కృత నిశ్చ‌యంతో ఉండ‌టం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: