గత ఎన్నికలకు కొద్ది రోజులు ముందే ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్యే సీటు ఇవ్వగా ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన రోజు నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ... ఎవరు చనిపోయినా.. చంద్రన్న స్ఫూర్తితో ఉమన్న ఆర్థిక సాయం పేరిట.. రూ.5 వేల సాయం అందిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అరాచకపర్వంలో టీడీపీ కార్యకర్త ఒకరు మృతి చెందితే.. ఆయనకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా లక్షా 50 వేల రూపాయల సాయాన్ని అందించారు. ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు నిత్యం ప్రజా క్షేత్రం లోనే ఉంటున్నారు.
ఇక తాజా మునిసిపల్ ఎన్నికల్లో జేసీ పవన్ను కూడా స్థానికంగా తీసుకువచ్చి.. ప్రచారం చేయిస్తున్నారు. దీంతో కళ్యాణ దుర్గంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కళ్యాణ దుర్గం మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని.. భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నా రు ఉమా. ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు. అందరి సమస్యలు వింటున్నారు. అదే సమయంలో పార్టీలో అసంతృప్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను గెలిపిస్తే వారు స్థానికంగా అందుబాటులో ఉండడం లేదు.
ఉమా ఓడిపోయినా ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కేడర్కు అందుబాటులో ఉంటున్నారు. వివాదాలకు దూరంగా తనకంటూ ఓ విజన్ క్రియేట్ చేసుకున్న ఆయన చంద్రబాబు విజన్ను జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కళ్యాణదుర్గం టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇది మరి మునిసిపల్ ఎన్నికల ఫలితాలను ఎంత వరకు ప్రభావితం చేస్తుందో ? చూడాలి.