తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ మండలంలో ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. 8 నెలల బాలుడిని ఒక విషపూరితమైన పాము కాటు వేసింది. దీంతో ఆ ముక్కు పచ్చలారని పసిబిడ్డ మృత్యువాత పడ్డాడు. ఈ దుర్ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే.. శిరీష అనే ఒక వివాహిత తన భర్త జానకి రాములు, కుమారుడితో కలిసి బూరుగడ్డ గ్రామంలోని తన తల్లిదండ్రులైన కారింగుల రామయ్య, అచ్చమ్మల ఇంటికి వచ్చింది. అయితే శనివారం రోజు వారంతా బయట పడుకున్నారు. ఇంతలోనే వర్షం రావడంతో ఇంట్లోకి వెళ్లి ఒక గదిలో నేల మీద పడుకున్నారు.

అయితే కొంత సమయం తర్వాత ఒక విషపూరితమైన పాము ఇంట్లోకి ప్రవేశించి బాలుడిని కాటేసింది. అనంతరం ఆ పాము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి పోతుంటే రామయ్య, అచ్చమ్మ చూసి వెంటనే దాన్ని వెంబడించారు. అలాగే వారితో పాటు శిరీష భర్త జానకిరాము తదితరులు పామును వెంబడించి చంపేశారు. ఆ తర్వాత చంపేసిన పాముని, పాము కాటుకి గురైన పసిబిడ్డను  హుజూర్‌ నగర్ గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ లేరని.. పాము కాటుకి తాము వైద్యం చేయలేమని నర్సులు చెప్పారు.

దీంతో ఇక చేసేదేమీలేక హుటాహుటిన సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి పసిబిడ్డను తరలించారు. దురదృష్టవశాత్తూ అక్కడ కూడా వైద్యులు డ్యూటీ లో లేకపోవడంతో.. కుటుంబ సభ్యులు బాలుడిని తీసుకొని ఖమ్మం/ కోదాడ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు. అయితే అప్పటికే బాలుడి పరిస్థితి మరింత క్షీణించింది. కొద్ది నిమిషాల్లోనే బాలుడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మార్గమధ్యంలోనే చనిపోయాడు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తమ కుమారుడికి సరైన సమయంలో చికిత్స చేసినట్లయితే బతికే వాడిని తల్లిదండ్రుల గుండెలవిసేలా ఏడుస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కొడుకు కళ్లముందే చనిపోయే సరికి తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు. తన పుట్టిల్లే తనకు కడుపుకోత మిగిల్చిందని శిరీష తల్లిదండ్రులు కూడా కంటతడి పెట్టుకున్నారు. బాలుడి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: