పిల్లిని
చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టుగా.. మన ఇంట్లోనే మనం రోజు వాడే పదార్దాలు,
కాయగూరలు, వస్తువులలో ఎన్నో సౌందర్య గుణాలు ఉంటే మనం మాత్రం ఎవరో ఎదో క్రీమ్
వాడారని, టీవీలలో ఎవరో ఎదో చూపించారని వాటికోసం పడరాని పాట్లు పడుతుంటాం. అయితే
పూర్వం నుంచీ మన పూర్వీకులు అవలభిస్తున్న సౌందర్య పద్దతులని మాత్రం మనం
విస్మరిస్తున్నాం. వాటిలో ముఖ్యమైనది, ప్రధాన మైనది బియ్యం నీళ్ళతో ఆచరించే
సౌందర్య పద్దతులు.
బియ్యం నీళ్ళలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఈరోజు నుంచీ మీరు కడిగిన బియ్యం నీళ్ళని జాగ్రత్తగా దాచుకుంటారు. సరే అసలు విషయంలోకి వెళ్తే. బియ్యం నీళ్ళలో ఎన్నో పోషక విలువలు ఉంటాయని అందుకే అన్నం వండి వార్చే టప్పుడు ఆ నీళ్ళని (గంజి ) దాచుకుని సూప్ లా త్రాగుతారు చాలా మంది. అదేవిధంగా బియ్యం నీళ్ళలో ఉన్న పోషకాలు జుట్టు బలంగా, బిగుతుగా, మృదువుగా చేయడానికి ఎంతో దోహద పడుతాయి. అందుకోసం మనం ఏమి చేయాలంటే..
ముందుగా బియ్యంలో స్వచ్చమైన 3 కప్పుల నీటిని పోసి సుమారు పావు గంట సేపు నానబెట్టాలి. ఆ తరువాత బియ్యాన్ని బాగా పిసికి ఈ క్రమంలో వచ్చిన నీటిని బియ్యం రాకుండా వడగట్టుకోవాలి. ఆ తరువాత వెంట్రుకలకి ఈ నీటిని కుదుళ్ళకి చేరేలా పట్టించాలి. ఇలా రెండు వారాలి చేయగానే మీ జుట్టు మునుపటి కంటే బలంగా, బిగుతుగా ఉన్నట్టుగా మీరు గుర్తిస్తారు. ఎండకి గాని, లేదంటే ఇతరాత్రా కారణాల ద్వారా ఎర్ర బడిన చర్మానికి గనుకా ఈ నీటిని పట్టించి బాగా ఆరబెడితే చర్మం నునుపు తేలి మునుపటి రూపం సంతరించుకుంటుంది.