ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేనే షాక్ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై నెగిటివ్గా ఆయన కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది ప్రజలకు కూరగాయాలో లేదా నిత్యావసరాలో పంపిణీ చేస్తూ ఎక్కువుగా సోషల్ మీడియాలో భజన చేసుకుంటున్నారన్న టాక్ ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి మాత్రం నాణ్యత లేని సరుకులు పంపిణీ చేసిన అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
కరోనా నేపథ్యంలో జర్నలిస్టులకు నాణ్యత లేని బియ్యం, కల్తీనూనె, సరుకులు ఇవ్వడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఇలాంటి వాటిని ఏ జంతువులు కూడా తినవని విమర్శించారు. అధికారులు ఎవరిని అప్రతిష్ట పాలు చేసేందుకు ఇలా చేస్తున్నారు ? అని ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా అధికారులు కావాలనే ఇలాాంటి పనులు ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఏదేమైనా మహీధర్ రెడ్డి ఓపెన్గానే ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపడం.. ఈ వీడియో వైరల్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.