ట్విటర్ సరిగా వ్యవహరించడంలేదు!
కొత్తగా అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనలను తక్షణమే అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విటర్కు తుది నోటీసులు జారీచేసింది. ఇవి అమలు కాకపోతే ఐటీ చట్టం కింద లభించే మినహాయింపులివ్వలేమని స్పష్టం చేసింది. నిబంధనలు అమలు చేయడంలో ట్విటర్ సరిగా వ్యవహరించడంలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ వ్యాఖ్యానించింది. నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ‘‘భారతదేశ చట్టాల అమలుకు ట్విటర్ కట్టుబడి ఉందని, నిబంధనలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని, ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు జరుపుతాం’’ అని ట్విటర్ వెల్లడించింది.
18వ తేదీన హాజరవ్వండి
కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఆయా సంస్థలు చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్ను నియమించాల్సి ఉంటుంది. అయితే ట్విటర్ దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. నిబంధనల ప్రకారం.. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ అధికారులుగా వేరే దేశానికి చెందినవారిని నియమించింది. భారత్కు చెందినవారిని నియమింపకపోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినా పాటించడానికి ట్విటర్ అంగీకరించడంలేదంటూ కేంద్రం చివరి హెచ్చరికగా 18వ తేదీన హాజరుకావాలని ఆదేశించింది. భారత ప్రభుత్వం, ట్విటర్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఈనెల 18వ తేదీన తెరపడే అవకాశం ఉంది.