క్షేత్రస్థాయిలో రైతు సమస్యలను, ఆర్థిక పరిస్థితులను ప్రభుత్వాలు సానుకూలంగా ఆలోచించక ఒంటెద్దు పోకడతో వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టి రైతులు బజారున పడడానికి కారణమవుతున్నాయి.
రైతాంగ సంక్షోభం:
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితులను మార్చాలనే ఉద్దేశ్యంతో రైతు బంధు, రైతు బీమా తో పాటు అనేక పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ లబ్ధి పొందేది మాత్రం ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారులు, భూస్వామ్య వర్గం అని తేలిపోయింది. 2018 లో ప్రారంభించిన రైతు బంధు పథకం కౌలు రైతులకు వర్తించకపోగా పరిమితి లేని కారణంగా వందలాది ఎకరాలు ఉన్నవారికి, బీడు భూములు, గుట్టలు, రాళ్ల భూములకు కూడా వచ్చిన కారణంగా లబ్ధి పొందినది బడా భూస్వామ్యా వర్గమే. చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులపై ఈ పథకం ద్వారా ఖర్చు చేసినది నామమాత్రమే. అటు ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడానికి రైతుబంధు కారణమౌతున్నది..
ఇక రైతులు దుర్భిక్ష పరిస్థితులు, అప్పులు, తదితర కారణాల వలన ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వారిని ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ద్వారా చెల్లించే ఐదు లక్షల రూపాయలకు కూడా అనేక పరిమితులు. అప్పులపాలై చనిపోయినది దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొనేది క్షేత్రస్థాయిలో కౌలు రైతులే. నిబంధన ప్రకారం వారికి ఈ పథకం వర్తించదు . చనిపోయిన రైతు పేరు మీద భూమి ఉండాలని 18 ఏళ్ల నుంచి 57 సంవత్సరాల లోపు వారికి మాత్రమే ఈ పథకం వర్తించడం తో కుటుంబ సభ్యుడైనా తన పేరుమీద భూమి లేని కారణంగా చనిపోతే రైతు బీమా అందడం లేదు. ఇక 57 సంవత్సరాలకు పైబడిన వారు ఎందరో క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేస్తున్నప్పటికీ నిబంధన మేరకు వయసు ఎక్కువ ఉన్న కారణంగా కూడా రైతు బీమా అమలు కావడం లేదు. ఇదంతా నిబంధనల సంక్షోభం కాదా.