విజీనగరం అంటే మా రాజుగోరి ఊరు. మా రాజుగోరు అంటే అశోక్ గజపతి రాజు ఊరు.విజీనగరం అంటే రాచనగరి వీధులున్న ఊరు.ఆనంద నిధులు గత కాల స్మరణలు ఉన్న ఊరు. రాజ్యాలు పోయినారు..రాజులు కూడా పోయినారు..కేవలం కొందరు దొరలు మాత్రమే ఆ బొబ్బిలి,సాలూరు,పార్వతీపురం, కురుపాం దారుల్లో మిగిలినారు.కానీ బొత్స మాత్రం దొర కాదు.కాపు సామాజికవర్గం కు చెందిన నేత.. ఆ విధంగా పోనీ వెలమ దొర కాదు కానీ కాపు దొర అని మాత్రం అనుకోవాలి. దొర చెంత దొరకునా ఇటువంటి సేవ అని పాడుకోవాలి మనం.మంత్రి బొత్స మాత్రం ఆ విధంగా పాడితేనే చాలా సంతోషిస్తారు.లేదంటే ఆయనకు కోపం వస్తుంది.
ఆయనకు,కేసీఆర్ దొరకు ఉన్నంత బంధం వేరెవ్వరికీ లేదు కూడా!కనుక విజయ నగరం దారుల్లో ఎవ్వరయినా బొత్స అనే దొర మాట విని పాటించి జీహుజుర్ అని అనక తప్పదు.లేదంటే ఆయన గారి కోట ఒప్పుకోదు. కోట ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా గడియారం స్తంభం ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా,బొంకుల దిబ్బ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆయన కోటరీ ఒప్పుకోదు.అందుకనో ఎందుకనో నిన్నటి వేళ జేసీ (రెవెన్యూ వింగ్) కిశోర్ కుమార్ అనే ఆఫీసర్ అనుకోకుండానే,అప్రయత్నంగానే బొత్స కాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెల్లించుకున్నారు.ఈ పరిణామంలో బొత్స ఝాన్సీ అనే మాజీ ఎంపీ, బొత్స జీవన సహచరి కూడా అక్కడే ఉన్నారు.ప్రత్యక్ష సాక్షి అయినారు. ఈ పరిణామం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.