బీజేపీ రాజకీయాల్లో ఆరితేరిన నేత... అటల్ బిహారీ వాజ్పేయ్ మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేసిన అనుభవం. గవర్నర్ గిరిని విజయవంతంగా చేసిన నేత ఇప్పుడు మళ్ళీ క్రియశీలక రాజకీయాల వైపు దృష్టి సారిస్తున్నట్లు బీజేపీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకు గవర్నర్గా పనిచేసిన ఈ నాయకుడు ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి ఎందుకు దృష్టి సారిస్తున్నట్లు అనేది చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న చెన్నమనేని విద్యాసాగర్రావు అందరికి సుపరిచితుడే.
చెన్నమనేని రాజేశ్వరరావుకు స్వయాన సోదరుడు. ఇప్పుడు రాజేశ్వరరావు కుమారుడు చెన్నమనేని రమేష్బాబు వేములవాడ ఎమ్మెల్యేగా వరుసగా నాలుగోసారి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇక విద్యాసాగర్రావు విషయానికి వస్తే ఆయన బీజేపీ ఎంపిగా పనిచేసి వాజ్పాయ్ కేబీనేట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. తరువాత బీజేపీ ప్రభుత్వం గవర్నర్గా మహారాష్ట్రకు నియమించింది.
ఇంతకాలం ఆయన గవర్నర్గా సేవలంది బీజేపీ బలోపేతం కోసం పరోక్షంగా మహారాష్ట్రలో పనిచేశాడు. ఆదివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. అందులో భాగంగా తెలంగాణకు కూడా కొత్తగా గవర్నర్ను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగరరావు ను కూడా బదిలీ చేసారు. ఇప్పుడు ఆయన తిరిగి బీజేపీ క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఆ పార్టీలోనే జోరుగా నడుస్తోంది.
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు చెన్నమనేని విద్యాసాగర రావు సేవలను పార్టీ ఉపయోగంచుకోవాలని రాష్ట్ర పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారట. తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణలో బీజేపీ బలోపేతం అయ్యేందుకు ఇప్పుడు సరైన సమయం అని గ్రహించిన బీజేపీ నాయకత్వం చెన్నమనేని విద్యాసాగర్ రావు కు మరో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.