కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు , పోలీసులు,పారిశుధ్య కార్మికులు వారి బాధ్యతలను మరింత ముమ్మరం చేశారు..వీరితో పాటుగా వీరి కింద పనిచేస్తున్న నర్సులు స్టాఫ్ కూడా మరింత జాగ్రత్తలు తీసుకుంటూ తమ విధులను నిర్వర్తిస్తున్నారు.. అంతేకాకుండా కరోనా రోగులను కరోనా నుంచి కాపాడటంలో మరింత శ్రద్ద చూపిస్తున్నారు..



 

 

కష్టకాలంలోనూ ఆస్పత్రుల్లో వైద్య సేవలందిస్తున్న సిబ్బందికి అభినందనలు వెల్లువెత్తుతుంటే ఓ భర్త మాత్రం దారుణానికి ఒడిగట్టాడు. ఉద్యోగం మానేయాలంటూ హుకుం జారీ చేశాడు. అందుకు నిరాకరించిందన్న కోపంతో ఉద్యోగానికి ఎలా వెళ్తావో చూస్తానంటూ ఇనుప రాడ్డుతో భార్య కాళ్లు, చేతులు విరగ్గొట్టిన అమానుష సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.



 

 

తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో వైద్యులకు సహాయకురాలిగా పనిచేస్తున్న త్రివేణికి దుర్గసముద్రానికి చెందిన డ్రైవర్ చరణ్‌తో ఆరేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. తిరుపతిలోని అనంతవీధిలో నివాసం ఉంటున్నారు. పెళ్లైన ఏడాది తర్వాత త్రివేణి ప్రసూతి ఆస్పత్రిలో సపోర్టింగ్ స్టాఫ్‌గా చేరారు. ఐదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆమె విధులకు హాజరవుతున్నారు.




 

 

 

అయితే కరోనా వస్తుందనే అపోహతో ఆమెను ఉద్యోగానికి వెళ్లకూడదని తేల్చి చెప్పాడు.. దానికి ఆమె ససేమిరా అనడంతో కోపొద్రుడైన అతను ఇనుప రాడ్డు తీసుకొని ఉద్యోగానికి ఎలా వెళ్తావో చూస్తానంటూ ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు..ఆమె కాళ్లు, చేతులు విరగ్గొట్టాడు. ఈ దాడిలో ఆమె రెండు చేతులు, కాలికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి భర్త పరారయ్యాడు. సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో త్రివేణిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స పొందుతుంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: