తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో రాజ్యసభ ఎన్నికల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే పార్టీ పరాజయం గురించి నేతల్లో చర్చ జరుగుతోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యే కంటే ఓట్లు తక్కువ రావడం సహజంగానే చర్చకు తెరలేపుతోంది. అయితే, తాజాగా ఈ అంశంలో మరో కీలక విషయం తెరమీదకు వచ్చింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పత్రికల్లో వార్తలు రాయించి అదే నిజమని కల్లబొల్లి కబుర్లు చెప్పే టీడీపీని ఓట్ల రూపంలో ప్రజలు చీల్చిచెండారని రమేష్ మండిపడ్డారు.
టీడీపీ రాష్ట్రంలో చనిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే రమేష్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబును ప్రజలెవ్వరూ నమ్మరని అన్నారు. తాజాగా రాజ్యసభ సాక్షిగా 23 స్థానాలు ఉంటే.. 17 ఓట్లు వాళ్లకు వచ్చాయి. 6 ఓట్లు రాలేదు. చంద్రబాబు మీద వాళ్ల ఎమ్మెల్యేలే తిరుగుబాటు బావుటా ఎగరవేశారన్నారు. ``అచ్చెన్నాయుడు ఆసుపత్రిలో ఉంటే.. మరో ఇద్దరు ఎందుకు రాలేదు. 21 ఓట్లు వస్తాయనుకుంటే.. 17 స్థానాలకు టీడీపీ దిగజారిపోయింది. రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ చదువుకున్న వ్యక్తి. కావాలని టీడీపీకి ఓటేయలేదు` అని జోగి రమేష్ అన్నారు. ``అచ్చెన్నాయుడుకు కేసులు. చంద్రబాబు వాళ్ల అబ్బాయికి ఏమో సూట్ కేసులు ఇస్తున్నారు అని గుర్తించి చంద్రబాబుకు భవానీ ఓటు వేయలేదు` అని రమేష్ అన్నారు.
బీసీలను చంద్రబాబు దోచుకొని దాచుకున్నారని, అనగాని సత్యప్రసాద్కు కూడా చంద్రబాబుపై నమ్మకం పోయిందని అన్నారు. ``రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యను బలిపశువు చేశారు. గతంలోనూ వారధి దాకా వచ్చి వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వటం లేదని చెప్పారు. మా సామాజిక వర్గానికి చెందిన కనకమేడల రవీంద్రకుమార్కు ఇచ్చామని చంద్రబాబు అన్నారు. పాపం ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి మోసపోయారు. గెలవలేని పరిస్థితుల్లో ఎస్సీ కులానికి చెందిన వర్ల రామయ్యను బలిపశువు చేశారని జోగి రమేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీకి నూకలు చెల్లిపోయాయి. టీడీపీకి అసలు నాయకత్వం ఉందా అని రమేష్ ప్రశ్నించారు. ఏదైనా చంద్రబాబు మాట్లాడాలి. లేకపోతే మాజీ మంత్రులు వచ్చి మాట్లాడాలి. అంతేకానీ దిక్కుమాలిన వారు వచ్చి మాట్లాడటం ఏంటి` అని జోగి రమేష్ మండిపడ్డారు. తాడు, బొంగరం లేనివారు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద, సీఎంపై, విజయసాయిరెడ్డిపై నిందలు వేసే కార్యక్రమం ఏంటని టీడీపీ తీరుపై జోగి రమేష్ మండిపడ్డారు. చంద్రబాబుకు నిరూపించే దమ్ముంటే.. తేది, ప్రదేశం ప్రకటిస్తే తమ దగ్గర ఉన్న ఆధారాలతో సహా వస్తాం అని జోగి రమేష్ సవాల్ విసిరారు.