ప్రస్తుతం ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశవ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దీనికోసం దేశంలో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చి సామాన్యులకు ఊరట  కలిగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎక్సైజ్ సుంకం తగ్గింపు యోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే వాహనదారులకు ఊరట. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం.


ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్‌ ఇంధనం కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ దేశీయ మార్కెట్లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే.రిటైల్‌ ధరల్లో దాదాపు 60 శాతానికి పైగా పన్నులు, సుంకాలే. గతేడాది కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో పన్ను ఆదాయాన్ని పెంచి వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం 12 నెలల్లో రెండు సార్లు పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాలను పెంచింది. దీంతో దేశంలో ఇంధన ధరలు పెరిగాయి.



దీనికి తోడు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం పెరగడంతో చమురు సంస్థలు ఉత్పత్తిని తగ్గించాయి. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో ధరలకు రెక్కలొచ్చాయి.ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సమాయత్తమైనట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్రాలు, చమురు సంస్థలు, చమురు మంత్రిత్వశాఖ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా సామాన్యులపై పన్ను భారం తగ్గించే పరిష్కారం కనుగొనాలని ఆర్థికశాఖ కోరినట్లు సమాచారం.


మార్చి రెండోవారం నాటిని సుంకాల తగ్గింపు లేదా ధరల స్థిరీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.చమురు ఉత్పత్తి చేసే ఓపెక్‌ దేశాలతో భారత్‌ త్వరలో సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత పన్ను తగ్గింపుపై నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ముడి చమురు ఉత్పత్తిని పెంచి ధరలు తగ్గేలా చూడాలని ఓపెక్‌ దేశాలను ఇప్పటికే భారత్‌ కోరింది. ఇదిలా ఉండగా.. దేశంలో ఇంధన ధరలు పెరగడంతో ఇటీవల కొన్ని రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: