జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోంది అని ఆయన ఆరోపించారు. పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు మరోసారి అభినందనలు చెప్పారు. దాడులు, బెదిరింపులతో వైసిపి నేతలు పాలన చేస్తున్నారు అని ఆరోపించారు. వారి దాష్టిక పాలను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించుకున్నాం అని ఆయన తెలిపారు. వారి దాడులను ఎలా ఎదుర్కోవాలి... క్షేత్రస్థాయి పోరాటాలకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో మా నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తాం అని పవన్ తెలిపారు.
ఇక నుంచి ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ప్రజల పక్షాన నిలబడతాం అన్నారు. ప్రతిపక్షాలను ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా బెదిరింపులు, దాడులకు పాల్పడింది అని ఆయన ఆరోపించారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు బలంగా నిలిచారు అని అన్నారు. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమై... మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచులు, 1576 ఉపసర్పంచులు, 4456 వార్డు సభ్యులు గెలిచాం అని వివరించారు. అలాగే నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది 1200 స్థానాలు. గెలుపొందింది 177 అని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 24 శాతం పైచిలుకు ఓట్ల శాతం సాధిస్తే.. పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు వచ్చాయి అన్నారు. ఈ ఫలితాలు గొప్ప మార్పునకు సూచనగా భావిస్తున్నాం అన్నారు.