లక్నో: సాధారణంగా కాలేజీల్లో అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అక్కడి టీచర్లు నానా హంగామా చేస్తారు. వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ కళాసాల మాత్రం దీనికి విరుద్ధంగా ఓ సర్క్యులర్ జారీ చేసినట్లున్న ఓ సర్క్యులర్ వైరల్ అవుతోంది. అమ్మాయిలంతా కచ్చితంగా బాయ్ ఫ్రెండ్ కలిగి ఉండాలనేది దాని సారాంశం. 

          

వ్యాలైంటైన్స్ డే నాటికి అమ్మాయిలంతా కనీసం ఒక్క బాయ్‌ఫ్రెండ్ అయినా కలిగి ఉండాల్సిందేనని, ఇది వాళ్ళ భద్రత కోసమేనాని యాజమాన్యం అంటున్నట్లు అందులో ఉంది. అంతేకాదు బాయ్ ఫ్రెండ్ లేకపోతే కాలేజీలోకి అడుగుపెట్టనీయ్యమంటూ ఆ సర్క్యులర్ లో పేర్కొన్నట్లుంది. 'మీకు బాయ్‌ఫ్రండ్స్ ఉన్నారనేందుకు రుజువుగా వారితో కలిసి దిగిన ఫొటోలను కూడా మాకు చూపించాలి..’  ఈ సర్క్యులర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


దీనికి తోడు 'ప్రేమను పంచండి' అంటూ సర్యులర్ చివర ఓ సలహా కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో గల ప్రముఖ సెయింట్ జాన్స్ కాలేజీ పేరిట విడుదలైనట్టు కనబడుతున్న ఈ సర్క్యులర్ ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫ్రొపేసర్ అశిశ్ శర్మ సంతకంతో జనవరి 14న ఇది జారీ అయినట్టు తెలుస్తోంది.


తొలుత విద్యార్థుల వాట్సాప్‌ గ్రూపుల్లో బయటపడ్డ ఈ ఆదేశాలు క్రమంగా సోషల్ మీడియా బాట పట్టాయి. ఈ పరిణామంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అలా అలా.. ఈ వ్యవహారమంతా కాలేజీ యాజమాన్యం వరకు వెళ్లింది. దీనిపై ప్రిన్సిపాల్ ప్రొపేసర్ ఎస్పీ సింగ్ స్పందించారు. ఇది కాలేజీ పరువు తీసేందుకు జరుగుతున్న ప్రయత్నమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రొఫెసర్ అశిశ్ శర్మ అనే అధ్యాపకుడు తమ కాలేజీలో లేనే లేరని ఆయన చెప్పారు. ఇటువంటి వాటిని పట్టించుకోవద్దని, బాధ్యులను వెతికిపట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: