ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం నియంత్రణ దిశగా మరిన్ని అడుగులు ముందుకేసింది. మద్యం ధరలను 25 శాతం పెంచుతూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీ సుకున్నట్టు ప్రభుత్వం వర్గాలు పేర్కొంటున్నాయి. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.
కాగా, కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఈనెల 4 నుంచి మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. కోవిడ్ కంటైన్మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాలు అయి ఉండాలి. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం పాటించాలి. అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండరాదు. మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు, రెడ్ జోన్లలోని మాల్స్లో ఉన్న వాటికి ఈ వెసులుబాటు వర్తించదు.