తెలంగాణలోని మరో జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఈ రోజు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ఓ గ్రామంలో వృద్ధుడికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే, వైద్యాధికారులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. గ్రామాన్ని వెంటనే కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇటీవల ఆ వృద్ధుడు జగిత్యాలలో ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాడు. దీంతో ఆస్పత్రిలోని ఇద్దరు వైద్యులతోపాటు మరో ఆరుగురిని క్వారంటైన్ను తరలించారు. అలాగే.. ఆ వృద్ధుడి బంధుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అతడు ఎవరెవరని కలిశాడు..? ఎక్కడెక్కడ తిరిగాడు...? తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
తెలంగాణలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందనుకుంటున్నతరుణంలోనే జగిత్యాలలో నమోదు అయిన పాజిటివ్ కేసుతో అధికారులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. నిజానికి.. హైదరాబాద్ నగరంలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల సూర్యాపేట జిల్లాలోనూ కరోనా కలవరానికి గురిచేసినా తొందరగానే అదుపులోకి వచ్చింది. తాజాగా.. మరో జిల్లా జగిత్యాలలో కొత్త కేసు నమోదు కావడంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.