తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీరియల్స్, టెలివిజన్ షోస్ షూటింగ్స్కు అనుమతి ఇచ్చింది. దీంతో సుమారు రెండు నెలలుగా ఆగిపోయిన షూటింగ్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో అనేక నిబంధనలను షూటింగ్ నిర్వాహకులకు విధించింది. షూటింగ్స్ ఇళ్లలో, స్టూడియోలలో మాత్రమే చేసుకోవాలని చెప్పింది. అలాగే కంటైన్మెంట్ జోన్లలో షూటింగ్ చేయొద్దని ఆదేశించింది. ఇక షూటింగ్ ప్రదేశాలలో నటీనటులు తప్ప మిగతా వాళ్లందరూ మాస్కులు ధరించాలని ఆదేశించింది.
షూటింగ్స్ను చూసేందుకు ప్రజలను అనుమతించవద్దని పేర్కొంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. షూటింగ్ లొకేషన్స్, వాహనాలను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలని చెప్పింది. షూటింగ్ సమయంలో సామాజిక దూరం పాటించాలని, నిత్యం చేతులను శుభ్రం చేసుకోవాలని పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నటీనటులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.